ఇది స్టార్టప్ల శకం
ABN , First Publish Date - 2021-11-29T08:29:36+05:30 IST
యువత ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశానికి.. అద్భుతాలు సృష్టించగలిగే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ...
స్టార్ట్ప్లో ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్
కరోనా ఇంకా పోలేదు.. జాగ్రత్తలు పాటించాలి
ప్రజలకు సేవ చేసేందుకే ప్రధానమంత్రి పదవి
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, నవంబరు 28: యువత ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశానికి.. అద్భుతాలు సృష్టించగలిగే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ‘స్టార్టప్’ అనే పదమే వినిపిస్తోందని, ప్రస్తుతం స్టార్ట్పల శకం నడుస్తోందని పేర్కొన్నారు. ఇందులో భారత్.. ప్రపంచంలోనే ముందుందని, దేశంలో 70కి పైగా స్టార్ట్పలు రూ.7500 కోట్ల విలువను దాటాయని తెలిపారు. ఏటేటా ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని, ఈ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. 2015 వరకు దేశంలో తొమ్మిది, పది యూనికార్న్లు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా భారత్లో ఉన్నాయన్నారు. దేశంలోని యువత వల్లే కొవిడ్ సంక్షోభ సయంలోనూ ఇవి విజయవంతం అయ్యాయన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. భారతీయ యువత తమ స్టార్టప్ల ద్వారా ప్రపంచ సమస్యల పరిష్కారంలోనూ పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. బస్సుల ఉద్గారాల వల్ల వచ్చే కాలుష్యాన్ని 40 శాతం తగ్గించేలా తన స్టార్టప్ ద్వారా సొల్యూషన్ను కనుగొన్న ఓ యువకుడితో ప్రధాని మాట్లాడారు.
నాది అధికారం కాదు..
తాను అధికారంలో ఉన్నట్లు భావించడంలేదని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తాను కోరుకుంటానని, ప్రధాని పదవి కూడా అందుకేనని తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధ్దిదారులతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తమిళనాడులోని తూత్తుక్కుడి జిల్లాకు చెందిన రాజేశ్కుమార్ అనే లబ్ధిదారుడు మాట్లాడుతూ, ‘మీరు ఎప్పుడూ అఽధికారంలో ఉండాలి’ అని ఆకాంక్షను వ్యక్తం చేశారు. దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ.. అధికారంలో ఉండాలని తనను ఆశీర్వదించవద్దని, ప్రజాసేవలో ఉండేలా ఆశీర్వదించాలని అన్నారు. కరోనా వైరస్ ఇంకా పోలేదని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మ్యూజిక్ వెబ్సైట్లలోనూ ‘మన్ కీ బాత్’..
ప్రధాని నరేంద్రమోదీ ప్రతి నెలా నిర్వహించే ‘మన్ కీ బాత్’ ఇకపై అన్ని ఆడియో, మ్యూజిక్ వెబ్సైట్లలోనూ అందుబాటులోకి రానుంది. స్పాటిఫై, హంగామా, గానా, జియో సాన్, వింక్, అమెజాన్ మ్యూజిక్ వంటి వేదికల్లోనూ ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ప్రధాని సందేశాన్ని దేశంలోని యువతకు చేరువ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.
తూత్తుక్కుడి ఆదర్శం
చెన్నై, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కడలి దీవులను పరిరక్షించేందుకు తాటిచెట్లను పెంచుతున్న తమిళనాడులోని తూత్తుక్కుడి ప్రజల సేవలు ప్రశంసనీయమని ప్రధాని మోదీ అన్నారు. తూత్తుక్కుడి ప్రజలు ఆ ప్రాంతంలోని చిన్న చిన్న దీవులు, ఇసుక దిబ్బలు సముద్రంలో కలిసిపోకుండా తాటి చెట్లను పెంచుతూ వాటిని పరిరక్షిస్తున్నారని గుర్తుచేశారు. తుఫానులు, పెనుగాలుల నుంచి తాటిచెట్లు ఆ ప్రాంతాన్ని పరిరక్షిస్తున్నాయని తెలిపారు.