కోవిడ్-19 వ్యాక్సిన్: దొంగల భయం... రహస్య స్థావరంలో నిల్వ!
ABN , First Publish Date - 2021-01-12T12:14:33+05:30 IST
కరోనా వ్యాక్సిన్ నిల్వ విషయంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

జోహన్నెస్బర్గ్: కరోనా వ్యాక్సిన్ నిల్వ విషయంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో భారత్ నుంచి అందుకునే కోవిడ్ వ్యాక్సిన్లను రహస్య స్థావరంలో నిల్వ చేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రతినిధి పోపో మాజా మీడియాకు తెలిపారు. టీకాలు దొంగతనంగా బ్లాక్ మార్కెట్కు తరలిపోయే అవకాశాలున్నందున వీటిని రహస్య స్థావరంలో నిల్వ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
వ్యాక్సిన్లు బ్లాక్ మార్కెట్కు తరలిపోతే వాటి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని పోపో మాజా పేర్కొన్నారు. కాగా ఇప్పటికే టీకాలు వేయడం ప్రారంభించిన పలు దేశాల్లో భారీగా బ్లాక్ మార్కెట్ దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే వ్యాక్సిన్లను నిల్వ చేసే ప్రదేశాన్ని బయట పెట్టకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ మంత్రి జ్వేలీ ఇటీవల భారత్ నుంచి 1.5 మిలియన్ మోతాదుల ఆస్టాజెనికా కోవిడ్ టీకాలను అందుంటున్నట్లు తెలిపారు. జనవరి నెలాఖరు నాటిని పది లక్షలు, ఫిబ్రవరిలో మరో ఐదు లక్షల వ్యాక్సిన్ మోతాదులను అందుకుంటున్నట్లు జేల్వీ వివరించారు.