పోలీసు కాల్పులపై చార్జిషీట్ ఎక్కడ?: సొంత సర్కార్పై సిద్ధూ ఫైర్
ABN , First Publish Date - 2021-11-08T21:24:21+05:30 IST
పంజాబ్లోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆ పార్టీ నేత, పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశ్నలు..
ఛండీగఢ్: పంజాబ్లోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆ పార్టీ నేత, పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశ్నలు గుప్పించారు. 2015లో జరిగిన కొట్కాపుర పోలీస్ కాల్పుల ఘటనపై ఛార్జిషీట్ ఏదని నిలదీశారు. ఆరు నెలల్లోగా కొట్కాపుర పోలీసు కాల్పుల ఘనటపై దర్యాప్తు పూర్తి చేయాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన గుర్తు చేశారు. ఇవాల్టికి ఆరు నెలల ఒక్క రోజు ముగిసిందని, ఛార్జిషీట్ ఎక్కడ అని పంజాబ్ సర్కార్ను నిలదీశారు. కాల్పుల ఘటన నిందుతుల్లో ఒకరైన మాజీ డీజీపీ సుమేథ్ సింగ్ షైనికి ఇచ్చిన బ్లాంకెంట్ బెయిల్కు వ్యతిరేకంగా ఎందుకు స్పెషల్ లీవ్ పిటిషన్ వేయలేదని కూడా ఆయన సర్కార్ను ప్రశ్నించారు.
2015లో ఫరీద్కోట్లో గురుగ్రంథ్ సాహిబ్ను అప్రవిత్రం చేసిన ఘటనపై అదే ఏడాది సిక్కుల నుంచి నిరనసలు వెల్లువెత్తాయి. సిక్కు ప్రదర్శకులపై కొట్కాపురలో పోలీసులు కాల్పులు జరిపారు. దీనిపై పంజాబ్ పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) జరిపిన దర్యాప్తును ఏప్రిల్లో హర్యానా హైకోర్టు కొట్టివేసింది. సిట్ దర్యాప్తునకు నాయకత్వం వహించిన అప్పటి ఐపీసీ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ ఆ తర్వాత క్రమంలో సర్వీస్ పూర్తికాకముందే పదవీ విరమణ చేశారు. హైకోర్టు ఆదేశాలతో మే 7న కొత్త సిట్ ఏర్పాటు చేశారు. దీనికి అడిషనల్ డీజీపీ ఎల్.కె.యాదవ్ నాయకత్వం వహించారు. కొట్కాపుర ఫైరింగ్ ఘటనపై దర్యాప్తు సాగించారు. పోలీసు కాల్పుల ఘటన ఒకటి కొట్కాపూర్లోనూ, రెండవది ఫరీద్కోట్లోని బెహ్బల్ కలాన్లోనూ చోటుచేసుకుంది. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏపీఎస్ డియోల్, అఫీషియేటింగ్ డీజీపీ సహోటాల నియామకాన్ని సిద్ధూ వ్యతిరేకిస్తున్నారు.