స్వామీజీలు రాజకీయాల్లో తలదూర్చొద్దు :siddaramaiah
ABN , First Publish Date - 2021-07-24T00:06:17+05:30 IST
రాష్ట్ర రాజకీయాల్లో స్వామీజీలు తలదూర్చడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య
బెంగళూరు : రాష్ట్ర రాజకీయాల్లో స్వామీజీలు తలదూర్చడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్వామీజీలు, పీఠాధిపతులు రాజకీయాల్లో వేలుపెట్టడం ఏమాత్రం బాగోలేదని మండిపడ్డారు. రాజకీయాల్లో ప్రజలదే అంతిమ నిర్ణయమని తేల్చి చెప్పారు. అయితే పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాత్రం భిన్నంగా స్పందించారు. స్వామీజీలు సీఎం యడియూరప్పకు మద్దతివ్వడంలో తప్పేమీ లేదన్నారు. కొన్నేళ్లుగా ఆయనే సీఎంగా కొనసాగుతున్నారు కాబట్టే, ఆయన్ను మార్చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు యడియూరప్ప వ్యవహార శైలిపై మాజీ సీఎం సిద్దరామయ్య తీవ్రంగా విరుచుకుపడ్డారు. వర్షాకాలం సందర్భంగా వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బీజేపీ మాత్రం రాజకీయాల్లో తలమునకలైందని దుయ్యబట్టారు. ఎవర్ని సీఎంగా నియమించుకున్నా తమకు ఇబ్బంది లేదని, అయితే బీజేపీ మాత్రం అవినీతి పార్టీ అని సిద్దరామయ్య విమర్శించారు.