Covid Certificateపై మోదీ ఫొటో తొలగించాలనడం ప్రమాదకర ఆలోచన : కేరళ హైకోర్టు
ABN , First Publish Date - 2021-11-03T19:50:50+05:30 IST
కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ నుంచి ప్రధాన మంత్రి
కొచ్చి : కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోను తొలగించాలనే ఆలోచన చాలా ప్రమాదకరమైనదని కేరళ హైకోర్టు పేర్కొంది. ఏదో ఓ రోజు ఎవరో వచ్చి కరెన్సీ నోట్లపై నుంచి మహాత్మా గాంధీ ఫొటోను తొలగించాలని కోరవచ్చునని వ్యాఖ్యానించింది. అలాంటపుడు ఏం జరుగుతుందని ప్రశ్నించింది.
కొట్టాయంకు చెందిన పీటర్ మయలిపరంబిల్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్ నగరేష్ విచారణ జరిపారు. నగరేష్ మౌఖికంగా మాట్లాడుతూ, ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన, ప్రతిపాదన అన్నారు. రేపు ఓ రోజు ఎవరో ఇక్కడికి వచ్చి, తనకు మహాత్మా గాంధీ అంటే ఇష్టం లేదని, కరెన్సీ నోట్లపై నుంచి ఆయన ఫొటోను తొలగించాలని కోరవచ్చునని చెప్పారు. రక్తం ఖర్చు పెట్టి, చెమటోడ్చి సంపాదించుకున్నామని, కరెన్సీ నోట్ల నుంచి గాంధీజీ ఫొటోను తొలగించాలని కోరవచ్చునన్నారు. అప్పుడు ఏం జరుగుతుందని ప్రశ్నించారు.
దీంతో పిటిషనర్ తరపు అడ్వకేట్ స్పందిస్తూ, మహాత్మా గాంధీ బొమ్మను భారతీయ రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం కరెన్సీ నోట్లపై ముద్రించారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోను చట్టబద్ధమైన నిబంధన ఏదీ లేకపోయినా ముద్రించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరడంతో తదుపరి విచారణ నవంబరు 23న జరుగుతుందని హైకోర్టు తెలిపింది.