Moradabad: జాతీయ గీతాన్ని మరచిపోయిన ఎంపీ
ABN , First Publish Date - 2021-08-16T17:29:11+05:30 IST
మన దేశ జాతీయ గీతాన్ని పిల్లలు కూడా ఆలపిస్తుంటారు...కాని సాక్షాత్తూ ఓ ప్రజాప్రతినిధి జాతీయగీతాన్ని మర్చిపోయిన ఘటన మొరాదాబాద్ నగరంలో ఆగస్టు 15వతేదీన స్వాతంత్ర్యదినోత్సవంలో వెలుగుచూసింది....
సోషల్ మీడియాలో వీడియో వైరల్
మొరాదాబాద్ (ఉత్తరప్రదేశ్): మన దేశ జాతీయ గీతాన్ని పిల్లలు కూడా ఆలపిస్తుంటారు...కాని సాక్షాత్తూ ఓ ప్రజాప్రతినిధి జాతీయగీతాన్ని మర్చిపోయిన ఘటన మొరాదాబాద్ నగరంలో ఆగస్టు 15వతేదీన స్వాతంత్ర్యదినోత్సవంలో వెలుగుచూసింది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన మొరాదాబాద్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఎస్టీ హసన్ స్థానిక గల్ షాహిద్ పార్కులో ఆదివారంనాడు జాతీయజెండాను ఎగురవేశారు.అనంతరం అందరూ మన జాతీయ గీతాన్ని ఆలపించడం మొదలు పెట్టారు. కాని రెండవ లైను జాతీయ గీతం ఆలపిస్తూ ఎంపీ హసన్ మర్చిపోయారు. ‘‘జయ జయ’’ అంటూ జాతీయ గీతం మొత్తాన్ని ఎంపీ హసన్ ఆలపించలేక పోయారు.
దీంతో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారు జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతాన్నే మర్చిపోయిన ఎంపీ హసన్ ఘటన వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకున్నారు. దేశాన్ని పాలిస్తున్న ఎంపీలు జాతీయగీతాన్ని మర్చిపోతే సాధారణ ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారని నెటిజన్లు ప్రశ్నించారు. ఎంపీ జాతీయ గీతాన్ని మర్చిపోవడం జాతీయ గీతానికే అవమానకరమని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఈ సంఘటన వీడియో మొరాదాబాద్ నగరం అంతటా వైరల్ అయింది.