Delhi: కొవిడ్ అనంతర సమస్యలతో రోగులు విలవిల
ABN , First Publish Date - 2021-08-13T14:50:47+05:30 IST
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగుల సంఖ్య...
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సెకండ్ వేవ్ సమయంలో కరోనా సోకిన వారు అనంతరం ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో చికిత్స కోసం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వస్తున్నారు. కొవిడ్ అనంతరం రోగుల్లో కండరాల తిమ్మిరి, వికారం, అలసట, అధికంగా జుట్టు రాలడం, మెదడు ఫాగ్, దడ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ డాక్టర్ ఎం వలీ చెప్పారు. మరికొద్దిమంది రోగులు దృష్టి లోపం, కళ్లలో నొప్పి, గుండె సమస్యలతో వస్తున్నారని,ఈ లక్షణాలన్నీ పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ అని డాక్టర్ వివరించారు.
ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో కొవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది.దీంతో అలాంటి రోగుల కోసం పడకలు అవసరమని వైద్యులు చెప్పారు. కొవిడ్ తగ్గిన రోగులు కొందరు శ్వాసలోపం గురించి చెపుతున్నారని, వీరిని ఐసీయూలో కాకుండా సాధారణ వార్డులో ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. ఢిల్లీలో గురువారం ఒక్కరోజు 49 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.