మాజీ సీజేఐ గోగోయ్కి పార్లమెంట్లో నోటీసులు
ABN , First Publish Date - 2021-12-13T22:07:51+05:30 IST
కొద్ది రోజుల క్రితం ఓ జాతీయ మీడియాకు గోగోయ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే రాజ్యసభకు గోగోయ్ హాజరు కాకపోవడాన్ని ప్రశ్నించారు. దీనికి గోగోయ్ సమాధానం ఇస్తూ ‘‘కొవిడ్ కారణంగా నేను రెండు సమావేశాలకు హాజరు కాలేకపోయాను..
న్యూఢిల్లీ: తనకు వెళ్లాలని అనిపించినప్పుడు పార్లమెంట్కు వెళ్తానని వ్యాఖ్యానించిన మాజీ సీజేఐ, రాజ్యసభ సభ ఎంపీ జస్టిస్ రంజన్ గోగోయ్కి పార్లమెంట్లో నోటీసులు పంపించింది తృణమూల్ కాంగ్రెస్. గోగోయ్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభ ధిక్కారంగా ఉన్నాయని, సభా గౌరవానికి ఆయన మాటలు భంగం కలిగిస్తున్నాయని, ప్రత్యేక అధికారాలపై కూడా ఇవి ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని సోమవారం పంపిన నోటీసులో టీఎంసీ పేర్కొంది.
కొద్ది రోజుల క్రితం ఓ జాతీయ మీడియాకు జస్టిస్ గోగోయ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే రాజ్యసభకు గోగోయ్ హాజరు కాకపోవడాన్ని ప్రశ్నించారు. దీనికి గోగోయ్ సమాధానం ఇస్తూ ‘‘కొవిడ్ కారణంగా నేను రెండు సమావేశాలకు హాజరు కాలేకపోయాను. సభలో సిట్టింగ్ ఏర్పాట్లు అంతగా బాగోలేవు. నాకు నచ్చినప్పుడు, నేను మాట్లాడాల్సిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయని భావించినప్పుడు నేను రాజ్యసభకు వెళ్తాను. నేను ఏ పార్టీ సభ్యుడిని కాను. నాపై విప్ జారీ చేయలేరు. నేను నామినేటెడ్ అభ్యర్థిని, స్వతంత్ర అభ్యర్థిని’’ అని గోగోయ్ అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ తాను రాజ్యసభ సభ్యుడిగా ఎలాంటి జీతాలు తీసుకోవడం లేదని, దీని కంటే ఏ ట్రిబ్యూనల్కో చైర్మెన్ అయ్యుంటే మంచి జీతాలు, సౌలభ్యాలు ఉండేవని పేర్కొన్నారు. గోగోయ్ 2020లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సభకు పదో వంతు కూడా ఆయన హాజరు కాలేదు. ఈ విషయమై ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.