రాజస్థాన్‌లో బస్సును తాకిన విద్యుత్ తీగ... ఆరుగురు దుర్మరణం!

ABN , First Publish Date - 2021-01-17T11:51:45+05:30 IST

రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలోని మహేష్పురా గ్రామంలో శనివారం అర్థరాత్రి దాటాక...

రాజస్థాన్‌లో బస్సును తాకిన విద్యుత్ తీగ... ఆరుగురు దుర్మరణం!

జాలోర్: రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలోని మహేష్పురా గ్రామంలో శనివారం అర్థరాత్రి దాటాక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఒక బస్సు విద్యుత్ తీగను తాకడంతో, బస్సంతటికీ విద్యుత్ ప్రవాహం సాగింది. ఆ సమయంలో బస్సులో 25 మంది వరకూ ప్రయాణికులున్నారు. వారందరూ విద్యుదాఘాతానికి గురికాగా, ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 


 సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులోని బాధితులను వెలుపలికి తీసుకువచ్చి, జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పీ శర్మ ఆధ్వర్యంలో వారికి చికిత్స అందిస్తున్నారు. కాగా బాధితులలో ఆరుగురు మృతి చెందారని డాక్టర్ శర్మ నిర్థారించారు. అలాగే మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని జోధ్‌పూర్ తరలించామని తెలిపారు. 13 మంది బాధితులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బస్సు దారితప్పి గ్రామంలోకి ప్రవేశించిందని మహేష్పురా నివాసి ధనశ్యామ్ సింగ్ తెలిపారు. గ్రామంలోని 11 కేవీ లైన్ బస్సుకు తాకడంతో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. తాము వెంటనే విద్యుత్ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారని తెలిపారు.

Updated Date - 2021-01-17T11:51:45+05:30 IST