భారత్లోని విదేశీయులు గృహ హింస కేసు పెట్టొచ్చు : రాజస్థాన్ హైకోర్టు
ABN , First Publish Date - 2021-11-24T20:29:59+05:30 IST
భారత దేశంలో గృహ హింసకు బాధితులైన విదేశీ జాతీయులు
జోధ్పూర్ : భారత దేశంలో గృహ హింసకు బాధితులైన విదేశీ జాతీయులు గృహ హింస చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చునని, ఇది ఆ బాధితుల హక్కు అని రాజస్థాన్ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. తాము విదేశీ జాతీయులమని, తన భార్య తనపై చేసిన ఫిర్యాదుకు విచారణార్హత లేదని ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది.
కేథరిన్ నెయిద్దు, రొబర్టో నెయిద్దు దంపతులు జోధ్పూర్లో ఉండేవారు. కేథరిన్ తన భర్త రొబర్టోపై 2019లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును రొబర్టో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సవాల్ చేశారు. ఆ తర్వాత మహిళలపై దురాగతాల కేసుల విచారణ న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ రెండు న్యాయస్థానాలు రొబర్టో వాదనను తోసిపుచ్చాయి. అనంతరం రొబర్టో హైకోర్టును ఆశ్రయించారు. తామిద్దరమూ భారత దేశ పౌరులం కాదని, తాము భారత దేశ అధికార పరిధికి లోబడినవారము కాదని వాదించారు.
ప్రతివాది కేథరిన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గృహ హింస నిరోధక చట్టం, 2005లోని సెక్షన్ 2(ఏ) ప్రకారం ‘బాధిత వ్యక్తి’ నిర్వచనం పరిధిలోకి ఇటువంటి హింసకు గురయ్యే విదేశీ పౌరులు కూడా వస్తారని తెలిపారు. ట్రయల్ కోర్టు సమక్షంలో దరఖాస్తు చేసే హక్కు విదేశీ పౌరులకు ఉందని పేర్కొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ కుమార్ మాథుర్ స్పందిస్తూ, కేథరిన్ పిటిషన్ను తిరస్కరించాలని రొబర్టో చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. రొబర్టో దాదాపు 25 ఏళ్ళపాటు జోధ్పూర్లో నివసించేవారని, ఆ తర్వాత కేథరిన్ను వివాహం చేసుకున్నారని గుర్తించారు. ఫిర్యాదులో చేసిన ఆరోపణలకు సంబంధించిన సంఘటన కూడా జోధ్పూర్లోనే జరిగిందని గమనించారు. గృహ హింస నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్లలో పేర్కొన్న నిర్వచనాల ప్రకారం, కేథరిన్ ఫిర్యాదుకు విచారణార్హత ఉందని తెలిపారు. రొబర్టో పిటిషన్ను తిరస్కరించారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం భారత దేశ పౌరులకు మాత్రమే కాకుండా ఈ దేశానికి చెందనివారికి కూడా రక్షణ లభిస్తుందని చెప్పారు. కేథరిన్కు రక్షణ పొందే హక్కు ఉందని తెలిపారు.