విభజించి పాలించడమే కాంగ్రెస్‌ నీతి

ABN , First Publish Date - 2021-02-26T09:27:42+05:30 IST

విభజించి పాలించడమే కాంగ్రెస్‌ నీతి అనీ, దశాబ్దాలుగా ఈ విధానాన్నే ఆ పార్టీ అనుసరిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. రెండ్రోజుల కిందట

విభజించి పాలించడమే కాంగ్రెస్‌ నీతి

అబద్ధాలాడడంలో అన్ని పతకాలూ వారివే

పుదుచ్చేరి సభలో మోదీ నిప్పులు


పుదుచ్చేరి, ఫిబ్రవరి 25: విభజించి పాలించడమే కాంగ్రెస్‌ నీతి అనీ, దశాబ్దాలుగా ఈ విధానాన్నే ఆ పార్టీ అనుసరిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. రెండ్రోజుల కిందట కేరళ పర్యటనలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ఉత్తరాది, దక్షిణాది రాజకీయాల మధ్య తేడాను వివరించడంపై బీజేపీ పెద్ద వివాదం లేవదీసింది. ఇది ప్రజల్ని విభజించడమేనని మోదీ పరోక్షంగా ధ్వజమెత్తారు. ‘‘ప్రజల మధ్య చీలికలు తెచ్చి పాలించడం విదేశీ నీతి. ఏళ్ల తరబడి వలస పాలనలో దీని వల్లే నలిగిపోయాం. కాంగ్రెస్‌ ఆ సంస్కృతినే పుణికిపుచ్చుకుంది. ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడం వారికి తెలిసిన విద్య. ఇలాంటివి అనుసరించడం వల్లే దేశప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. అబద్ధాలు వల్లె వేయడంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు మూడూ కాంగ్రె్‌సవే’’ అని గురువారంనాడిక్కడ ఓ ఎన్నికల సభలో దుయ్యబట్టారు. అధికారంలోకొస్తే మత్స్యసంపదపై ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని రాహుల్‌ అనడంపై మోదీ విస్మయం వ్యక్తం చేశారు. 2019లోనే ఆ శాఖను తాము ఏర్పాటుచేశామన్నారు.


పుదుచ్చేరిలో కొద్ది రోజుల కిందట కాంగ్రెస్‌ సారథ్య ప్రభుత్వం పతనం కావడంపై ప్రజలు పండుగ చేసుకొంటున్నారని మోదీ అన్నారు. తమిళనాడులో కూడా మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘డీఎంకే- కాంగ్రె్‌సలు రెండూ అవినీతిలో భాగస్వాములు. సీట్ల పంపిణీ కోసం కాదు, రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో పథకాలు రచించేందుకు ఆ పార్టీల నేతలు సమావేశమవుతారు’ అని కోవై సభలో విమర్శించారు.

Updated Date - 2021-02-26T09:27:42+05:30 IST