భారతీయ సంస్కృతిపై ఆసక్తి పెరుగుతోంది : మోదీ

ABN , First Publish Date - 2021-12-27T00:18:37+05:30 IST

భారత దేశ సంస్కృతి గురించి తెలుసుకోవాలనే

భారతీయ సంస్కృతిపై ఆసక్తి పెరుగుతోంది : మోదీ

న్యూఢిల్లీ : భారత దేశ సంస్కృతి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి విదేశీయుల్లో పెరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆదివారం మాట్లాడుతూ, మన సంస్కృతిని ప్రోత్సహించడానికి, అందరికీ తెలియజేయడానికి కూడా వారు సహాయపడుతున్నారన్నారు. పుస్తక పఠనం పట్ల ప్రజలు ఆసక్తి పెంచుకోవాలన్నారు. ‘‘ఈ ఏడాది మీరు చదివిన పుస్తకాల గురించి నాకు చెప్పండి. 2022లో ఏయే పుస్తకాలు చదవాలో ఓ జాబితాను తయారు చేసుకోవడానికి ఇతరులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది’’ అని చెప్పారు. 


ఇటీవల తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌లకు మోదీ గౌరవ వందనం చేశారు. వరుణ్ సింగ్ అనేక రోజులపాటు మృత్యువుతో సాహసోపేతంగా పోరాడారని, చివరికి దురదృష్టవశాత్తూ అమరుడయ్యారని చెప్పారు. 2021 ఆగస్టులో ఆయనను శౌర్య చక్రతో సత్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన తాను చదివిన పాఠశాల ప్రిన్సిపాల్‌కు రాసిన లేఖలో సామాన్యంగా ఉండటం గురించి గొప్పగా చెప్పారన్నారు. 


‘మన్ కీ బాత్’ లక్ష్యాన్ని వివరిస్తూ, ఇది ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడం కోసం కాదన్నారు. క్షేత్ర స్థాయిలో మార్పు కోసం పని చేసేవారి సమష్టి కృషిని వివరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. 


కరోనా వైరస్ రూపాంతరం ఒమైక్రాన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. 


Updated Date - 2021-12-27T00:18:37+05:30 IST