సాయం అందించేందుకు ఆస్తిపాస్తుల తాకట్టుకైనా సిద్ధం: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ
ABN , First Publish Date - 2021-05-11T18:08:30+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని పీలీభీత్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.
పీలీభీత్: ఉత్తరప్రదేశ్లోని పీలీభీత్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తన సొంత ఖర్చుతో కరోనా బాధితులకు సాయం అందించేందుకు వంద భారీ ఆక్సిజన్ సిలిండర్లను స్వయంగా తీసుకువచ్చి, వాటిని జిల్లా పరిపాలన, ఆరోగ్యశాఖ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సంక్షోభంలో చిక్కుకున్న బాధితులకు సహాయం అందించేందుకు తన ఆస్తిని తాకట్టు పెట్టడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
కరోనా బాధితుల కోసం వంద భారీ ఆక్సిజన్ సిలిండర్లను అందజేస్తానని కొద్దిరోజుల క్రితం ఎంపీ వరుణ్ గాంధీ స్థానికులకు హామీ ఇచ్చి, దానిని ఇప్పుడు నిలబెట్టుకున్నారు. కాగా ఉత్తరప్రదేశ్లో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.. గడచిన 24 గంటల్లో కొత్తగా 21,331 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 278 మంది మృతి చెందారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,25,271కు చేరింది. గడచిన 24 గంటల్లో మొత్తం 29,709 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.