భారత్-పాక్ మ్యాచ్పై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ
ABN , First Publish Date - 2021-10-25T21:38:32+05:30 IST
భారత ఆటగాళ్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ప్రతి అంశం మతాల మధ్య గొడవలా తయారవుతోందని, మైనారిటీ మతస్తులను దోషులుగా చూపించి మెజారిటీ మతస్తులను రాజకీయంగా ఉపయోగించుకునే రాజకీయాలు చెలరేగుతున్నాయని ఆయన విమర్శించారు..
హైదరాబాద్: టీ-20 వరల్డ్ కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇండియా ఘోర పరాభవం అయిన విషయం తెలిసిందే. అయితే కొందరు క్రీడాస్ఫూర్తిని పూర్తిగా మర్చిపోయి భారత ఆటగాళ్లపై బూతులతో మాటల దాడికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆ దూషణలో మతపరమైన కోణం తీవ్రంగా కనిపిస్తోంది. తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. మీసం లేకుండా గడ్డంలో ఉన్న విరాట్ కోహ్లీ (ఫొటోషాప్) ఇమేజ్ను షేర్ చేస్తూ ‘విరాటుద్దీన్ కోహ్ అలీ’ అంటూ ప్రచారం చేస్తున్నారు. జట్టులో ఉన్న ఏకైక ముస్లిం ఆటగాడు మహ్మద్ షమీపై కూడా ఇలాంటి దాడే జరుగుతోంది.
కాగా, భారత ఆటగాళ్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ప్రతి అంశం మతాల మధ్య గొడవలా తయారవుతోందని, మైనారిటీ మతస్తులను దోషులుగా చూపించి మెజారిటీ మతస్తులను రాజకీయంగా ఉపయోగించుకునే రాజకీయాలు చెలరేగుతున్నాయని ఆయన విమర్శించారు. జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉన్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తే ఎందుకు టార్గెట్ అవుతున్నాడని ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘కశ్మీర్లో భారతీయులు, జవాన్లు చనిపోతున్నారు. పక్క దేశం నుంచి వస్తున్న ఉగ్రవాదులు మన దేశస్తుల ప్రాణాలు తీస్తున్నారు. అదే ఉద్రిక్త వాతావరణం భారత్-పాక్ మధ్య జరుగుతున్న ఆటల్లోనూ కనిపిస్తోంది. జట్టులో 11 మంది ఆటగాళ్లలో ఒక ముస్లిం వ్యక్తి ఉన్నారు. అలాంటప్పుడు ఓటమికి ఒక వ్యక్తి ఎలా బాధ్యుడు అవుతాడు? ముస్లింలపై ద్వేషాన్ని పెంచి పోషించి రాజకీయంగా లబ్ది పొందే కుట్రల్లో భాగం ఇది’’ అని ఓవైసీ అన్నారు.