సహేతుక పరిమితులైతే ఓకే!
ABN , First Publish Date - 2021-02-26T08:59:05+05:30 IST
సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త నియమావళిపై న్యాయనిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియా కొత్త నిబంధనలపై కొందరు నిపుణుల అభిప్రాయం
రాజ్యాంగమిచ్చిన వాక్స్వాతంత్ర్యనికి విఘాతం
మరికొందరు న్యాయ నిపుణుల ఆందోళన!
భారత చట్టాలకు లోబడి ఉండాల్సిందే: అమిత్ షా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త నియమావళిపై న్యాయనిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం విధించిన పరిమితులు రాజ్యాంగంలోని 19వ అధికరణానికి లోబడి ఉంటే చెల్లుతాయని కొందరు న్యాయనిపుణులు పేర్కొన్నారు. ఏదేమైనా సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని.. వాటిని నియంత్రించే హక్కు ప్రభుత్వానికి ఉందని చెబుతున్నారు. మరికొందరేమో.. అసలు ఈ నిబంధనలు రాజ్యాంగం ప్రసాదించిన వాక్స్వాతంత్ర్యానికి, వ్యక్తిగత గోప్యతకు భంగమని తేల్చిచెబుతున్నారు. సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలకు కట్టుబడి పనిచేయాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పష్టం చేశారు.
కొత్త నిబంధనలు వినియోగదారులకు సాధికారతనిస్తాయని తెలిపారు. ఇక.. కొత్త నిబంధనలను పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని ఫేస్బుక్ సంస్థ పేర్కొంది. సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్ల కంటెంట్పై కేంద్రం రూపొందించిన కొత్త నియమావళిని స్వాగతిస్తున్నామని బీజేపీ నేత విజయశాంతి తెలిపారు.