ఏడుగురు నైజీరియన్లకు ‘ఒమైక్రాన్’ పరీక్షలు
ABN , First Publish Date - 2021-12-15T14:02:39+05:30 IST
నైజీరియా నుంచి విమానంలో చెన్నైకి వచ్చిన ఏడుగురికి ‘ఒమైక్రాన్’ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. తిరుచ్చి జిల్లా మనప్పారైలో మంగళవారం ఉదయం 142,5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వ కేంద్రాన్ని

చెన్నై: నైజీరియా నుంచి విమానంలో చెన్నైకి వచ్చిన ఏడుగురికి ‘ఒమైక్రాన్’ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. తిరుచ్చి జిల్లా మనప్పారైలో మంగళవారం ఉదయం 142,5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ రెండో విడత వ్యాప్తి సందర్భంగా రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వుండేదని, ప్రస్తుతం ఏ జిల్లాలోనూ, ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదని చెప్పారు. రాష్ట్రంలో మునుపు 61 ఆర్టీపీసీఆర్ యంత్రాలు వుండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య 79కి పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం రోజుకు లక్షా 88 వేల మందికి పైగా ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మంగళవారం అదనంగా 20 ఆర్టీపీసీఆర్ యంత్రాలను వినియోగంలోకి తెచ్చినట్టు ఆయన చెప్పారు. యాభై దేశాల్లో కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ ‘ఒమైక్రాన్’ వ్యాప్తించిందని, భారతదేశంలో ఇప్పటివరకూ 38 మందికి ఒమైక్రాన్ సోకినట్టు నిర్ధారించారని చెప్పారు. రాష్ట్రంలో రెండు రోజులకు ముందు దోహా మీదుగా నైజీరియా నుండి విమానంలో చెన్నైకి వచ్చిన ఒకరికి, ఆయనతోపాటు ప్రయాణించిన ఆరుగురికి ‘ఒమైక్రాన్’ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ ఏడుగురికి కరోనా ముందస్తు వైద్యపరీక్షలు జరిపినప్పుడు పాజిటివ్ లక్షణాలు నిర్ధారణ అయ్యాయని, వారికి కొత్త వైరస్ ఒమైక్రాన్ సోకి వుంటుందనే అనుమానంతో తగిన వైద్యపరీక్షలు జరుపుతున్నామని చెప్పారు. బెంగళూరు ప్రయోగశాల నుంచి వీరికి సంబంధించిన ఫలితాలు వెలువడాల్సిఉందన్నారు. ఇదివరలో ‘ఒమైక్రాన్’ సోకిందనే అనుమానంతో 29 శాంపిల్స్ను ప్రయోగశాలలకు పంపినప్పుడు సాధారణమైన డెల్టా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యందని చెప్పారు. తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రి ఒమైక్రాన్ వార్డులో నలుగురు చికిత్సలు పొందుతున్నారని, అయితే వారికి కొత్త వైరస్ సోకినట్లు నిర్ధారణ కాలేదని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేఎన్ నెహ్రూ, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జే రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.