ఆర్థిక సలహాదారుగా ‘నోబెల్’ గ్రహీత!
ABN , First Publish Date - 2021-06-22T06:53:19+05:30 IST
తమిళనాడులో అభివృద్ధిని పరుగులెత్తించేందుకు ఆర్థిక సలహామండలిని ఏర్పాటు
![ఆర్థిక సలహాదారుగా ‘నోబెల్’ గ్రహీత!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సలహా మండలి ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం
చెన్నై, జూన్ 21(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో అభివృద్ధిని పరుగులెత్తించేందుకు ఆర్థిక సలహామండలిని ఏర్పాటు చేయాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా కుంటుపడిన రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పటికే ప్రతిపక్షాలు సహా అన్ని వర్గాల సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఆర్థిక సలహా మండలిని ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు.
సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించిన గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఈ మేరకు ప్రకటించారు. ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలను ఆర్థిక సలహామండలి అందిస్తుంది. ఈ మండలిలో సభ్యులుగా నోబెల్ అవార్డు గ్రహీత, అమెరికా ఆర్థిక నిపుణుడు ఎస్తర్ డుఫ్లో, రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, కేంద్ర ఆర్థికశాఖ మాజీ సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం, కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎస్.నారాయణన్, ప్రొ.జీన్ డ్రీజీ ఉంటారు.