రోడ్డు లేక పెళ్లి కావడంలేదు!
ABN , First Publish Date - 2021-09-17T08:49:04+05:30 IST
పక్కా రోడ్డు లేక తమ గ్రామం లోని యువతులకు పెళ్లి కుదరడంలేదని,పిల్లలు బడి మానేస్తున్నారని ప్రధాని మోదీకి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి ఓ యువతి లేఖ రాశారు. తమ గ్రామానికి రోడ్డు నిర్మించేదాకా తాను పెళ్లి చేసుకునేది లేదన్నారు.
ప్రధానికి ఓ యువతి లేఖ.. రంగంలోకి దావణగెరె కలెక్టర్
బెంగళూరు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): పక్కా రోడ్డు లేక తమ గ్రామం లోని యువతులకు పెళ్లి కుదరడంలేదని,పిల్లలు బడి మానేస్తున్నారని ప్రధాని మోదీకి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి ఓ యువతి లేఖ రాశారు. తమ గ్రామానికి రోడ్డు నిర్మించేదాకా తాను పెళ్లి చేసుకునేది లేదన్నారు. దీంతో దావణగెరె జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. జిల్లాలోని మాయకొండ హోబళి హెచ్ రాంపుర గ్రామానికి చెందిన బిందుశ్రీ ఇటీవలే ప్రధానికి ఓ లేఖ రాశారు. ఆమె ఓ ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేస్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు లేక బస్సు రావడం లేదని, విద్యార్థులు స్కూలు మానేస్తున్నారని, అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదంటూ గ్రామ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దావణగెరె కలెక్టర్ మహంతేశ్ బీళగి గురువారం రాంపురలోని బిందుశ్రీ నివాసానికి వెళ్లి చర్చించారు. గ్రామానికి రోడ్డు వేస్తామని, బిందుశ్రీకి పెళ్లి కూడా చేస్తామని ఆమె కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. గ్రామానికి రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.