సెలబ్రిటీల ట్వీట్లపై స్పందించిన ఎంపీ నవనీత్ రానా
ABN , First Publish Date - 2021-02-08T23:44:54+05:30 IST
సెలబ్రిటీల ట్వీట్లపై వస్తున్న విమర్శలను మహారాష్ట్రకు చెందిన అమరావతి ఎంపీ నవనీత్ రానా తనదైన శైలిలో తిప్పి కొట్టారు.
![సెలబ్రిటీల ట్వీట్లపై స్పందించిన ఎంపీ నవనీత్ రానా](https://media.andhrajyothy.com/appimg/galleries/2021020806052020/02082021181303n12.jpg)
న్యూఢిల్లీ: సెలబ్రిటీల ట్వీట్లపై వస్తున్న విమర్శలను మహారాష్ట్రకు చెందిన అమరావతి ఎంపీ నవనీత్ రానా తనదైన శైలిలో తిప్పి కొట్టారు. తాము దేశభక్తులా.. దేశవ్యతిరేకులా అనేది నిరూపించుకోవలసిన అవసరం వారికి లేదని కుండబద్దలు కొట్టారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, తమకు నచ్చినది ఎప్పుడైనా వ్యక్తికరీంచుకునే స్వేచ్ఛ వారికి ఉందన్నారు. ట్వీట్ల ద్వారా ఎవరైనా ఈ దేశ హీరోలను తప్పుబడితే.. వాళ్లే నిజమైన దేశ వ్యతిరేకులని నవనీత్ అన్నారు.
వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఉద్యమం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. రైతులకు మద్దతుగా పాప్ సింగర్ రిహానా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ ట్వీట్స్ చేయడంతో సచిన్, లతామంగేష్కర్ వంటి సెలబ్రిటీలు కేంద్రానికి మద్దతుగా నిలిచారు. దేశ అంతర్గత విషయాల్లో ఇతరులు జోక్యం తగదన్నట్టు ట్వీట్స్ చేశారు. వీరి ట్వీట్లు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో వాళ్లకు ప్రతికూల, అనుకూల చర్చలతో సోషల్ మీడియా మార్మోగుతోంది.