పశ్చాత్తాపం వ్యక్తం చేస్తేనే సభలోకి!

ABN , First Publish Date - 2021-12-15T06:56:17+05:30 IST

సస్పెన్షన్‌కు గురైన 12 మంది రాజ్యసభ సభ్యులు, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే సభలోకి రావొచ్చునని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొన్నారు.,,,

పశ్చాత్తాపం వ్యక్తం చేస్తేనే   సభలోకి!

  • 12 మంది సభ్యుల సస్పెన్షన్‌పై ప్రహ్లాద్‌ జోషి


న్యూఢిల్లీ, డిసెంబరు 14: సస్పెన్షన్‌కు గురైన 12 మంది రాజ్యసభ సభ్యులు, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే సభలోకి రావొచ్చునని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌  జోషి పేర్కొన్నారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే ఆరోపణలతో ప్రస్తుత సమావేశాల నుంచి 12 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ 12 మంది సభ్యులపై విఽధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్షాలకు చెందిన ఎంపీలు మంగళవారం ఢిల్లీలో గాంధీ విగ్రహం నుంచి విజయ్‌ చౌక్‌ వరకు మార్చ్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పందించారు.


విపక్షాలకు దేశ ప్రజలు గతంలో వరుసగా రెండుసార్లు మార్చింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చారంటూ 2014, 2019 ఎన్నికల్లో వరుస ఓటమిపాలయ్యారనే విషయాన్ని పరోక్షంగా గుర్తుచేస్తూ మంత్రి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ వారి సంఖ్య మరింతగా తగ్గుతుందని జోస్యం చెప్పారు. కాగా అంతకముందు విపక్ష ఎంపీల ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్‌ నేత  రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఇప్పటికే ఎంపీలను సస్పెండ్‌ చేసి రెండు వారాలు అవుతోందని.. పార్లమెంటు ఆవల వారు ఆందోళన చేస్తుంటే గొంతునొక్కుతున్నారని ఆరోపించారు. కాగా.. మంత్రులు తమ కార్యాలయాలను లోక్‌సభ లోపల నడపరాదని స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు. ప్రశ్న గంట ముగిసిన తర్వాత మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, తనవద్దకు వచ్చిన ఓ సభ్యుడితో మాట్లాడుతుండటంపై స్పీకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్న గంట ముగిసిందని ప్రకటించిన తర్వాత కూర్చోవాలని కోరినా కేంద్రమంత్రి కైలాశ్‌ చౌదరీ ఓ ప్రశ్నకు సమాధానాన్ని కొనసాగించడంపైనా ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. 


ప్రభావిత జిల్లాలు తెలంగాణలో 6, ఏపీలో 5

దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 70కి తగ్గిందని కేంద్రం పేర్కొంది. అత్యధికంగా జార్ఖండ్‌లో 16 జిల్లాలు.. ఆ తర్వాత ఛత్తీ్‌సగఢ్‌లో 14 జిల్లాలు.. బిహార్‌, ఒడిసాలో 10 చొప్పున జిల్లాలు.. తెలంగాణలో ఆరు.. ఏపీలో ఐదు, కేరళలో మూడు చొప్పున.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో ఒకటి చొప్పున ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రినిత్యానంద్‌ రాయ్‌ వివరాలు వెల్లడించారు. 

Updated Date - 2021-12-15T06:56:17+05:30 IST