వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు కృషి : నరేంద్ర సింగ్ తోమర్

ABN , First Publish Date - 2021-02-05T19:00:52+05:30 IST

వ్యవసాయ రంగానికి అవసరమైన పెట్టుబడులు సమకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం

వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు కృషి : నరేంద్ర సింగ్ తోమర్

న్యూఢిల్లీ : వ్యవసాయ రంగానికి అవసరమైన పెట్టుబడులు సమకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి క్రింద రూ.1 లక్ష కోట్లు స్వయం సమృద్ధ భారత్ పథకంలో భాగంగా కేటాయించినట్లు తెలిపారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని ఉత్పాదక వ్యయం కన్నా 50 శాతం ఎక్కువ ఇస్తున్నామన్నారు. 


నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభలో మాట్లాడుతూ, ఉత్పాదక వ్యయం కన్నా 50 శాతం ఎక్కువగా ఎంఎస్‌పీని ఇవ్వడం ప్రారంభించామన్నారు. స్వయం సమృద్ధ భారత్ పథకం క్రింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రూ.1 లక్ష కోట్లతో ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ రంగానికి అవసరమైన పెట్టుబడులను సమకూర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 


రైతులకు అనుకూలమైన ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయన్నారు. గ్రామ పంచాయతీలకు రూ.2.36 లక్షల కోట్లు అందజేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని, ఈ సిఫారసును కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ రంగానికి రూ.43 వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల ద్వారా ఐదేళ్లలో రూ.2.8 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. 


గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం నిధులను తమ ప్రభుత్వం పెంచుతూ పోతోందన్నారు. కోవిడ్-19 మహమ్మారి మన దేశాన్ని కుదిపేసిన సమయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేటాయింపులను రూ.61 వేల కోట్ల నుంచి రూ.1,11,500 కోట్లకు పెంచినట్లు తెలిపారు. 10 కోట్ల మందికి పైగా దీనివల్ల ఉపాధి పొందినట్లు తెలిపారు.




 

Updated Date - 2021-02-05T19:00:52+05:30 IST