ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
ABN , First Publish Date - 2021-11-05T17:26:14+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం చార్ధామ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు.

ఉత్తరాఖండ్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం చార్ధామ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో 12 అడుగుల ఎత్తైన ఆదిగురు శంకరాచార్య విగ్రహాన్ని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 2019లో ఈ విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. పురాతన ఆలయంలో ప్రధాని ప్రార్థనలు చేసి 'ఆరతి' నిర్వహించిన అనంతరం మోదీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విగ్రహ విశేషాలు..
ఆదిగురు శంకరాచార్య విగ్రహం 12 ఫీట్ల పొడవు, బరువు 35,000 కిలోలు. దీనిని మైసూర్కు చెందిన శిల్పులు క్లోరైట్ స్కిస్ట్తో తయారు చేశారు. భీకర వర్షాలు, ఎండలతో పాటు ఎలాంటి ప్రకృతి వైపరిత్యం తలెత్తినా తట్టుకునేలా దీనిని నిర్మించారు. మైసూర్కు చెందిన ప్రముఖ శిల్పి యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు.
130 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆదిశంకరాచార్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం 130 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. కేథార్నాథ్ టెంపుల్ దగ్గర సరస్వతి రిటనింగ్ వాల్, ఘాట్స్, మంధాకిని రిటనింగ్ వాల్, తీర్థ్ పురోహిత్ల గృహ నిర్మాణాలు, గురుధ్ చట్టి బ్రిడ్జ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆది శంకరాచార్య భక్తులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారన్నారు. దేశంలోని అన్ని జ్యోతిర్లింగాలు మనతో అనుసంధానించబడి ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.
ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన డెహ్రాడూన్లోని జాలిగ్రాంట్ ఎయిర్పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కేదార్నాథ్కు చేరుకున్నారు. కేదార్నాథ్లో ప్రత్యేక పూజల అనంతరం.. ఆది శంకరాచర్యాల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆది శంకరాచార్యుల సమాధితో పాటు ఎన్నో కట్టడాలు కొట్టుకుపోయాయి. వాటిని కేంద్రం పునర్నిర్మిస్తోంది. దీనిలో భాగంగానే ఆది శంకరాచార్యుల సమాధికి మరమ్మతులు చేశారు.