ఆహారం ఉచితంగా ఇవ్వలేదట.. బార్ సిబ్బందిని చితకబాదిన పోలీసు అధికారి
ABN , First Publish Date - 2021-12-24T00:24:06+05:30 IST
హుందాగా ప్రవర్తించాల్సిన ఓ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్.. తన స్థాయిని మర్చిపోయి దిగజారాడు. ఆహారాన్ని ..
ముంబై: హుందాగా ప్రవర్తించాల్సిన ఓ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్.. తన స్థాయిని మర్చిపోయి దిగజారారు. ఆహారాన్ని ఉచితంగా ఇచ్చేందుకు నిరాకరించిన బార్ సిబ్బందిపై దాడి చేశారు. ముంబైలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి విపరీతంగా వైరల్ అవుతోంది. తమ సిబ్బందిపై దాడి చేసిన వకోలా పోలీస్ స్టేషన్ ఏపీఐ విక్రమ్ పాటిల్పైబార్ బార్ యజమాని మహేశ్ షెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తొలుత క్యాషియర్ రామ్దాస్ పాటిల్కు ఫోన్ చేసిన పోలీసు అధికారి ఆహారం పంపమని కోరారు. అయితే, కిచెన్ అప్పటికే మూసివేయడంతో అదే విషయాన్ని ఆయన ఏపీఐ విక్రమ్ పాటిల్కు తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే బార్కు వచ్చిన ఆయన వచ్చీ రావడమే క్యాషియర్పై విరుచుకుపడ్డారు. బూతులు తిడుతూ దాడిచేసినట్టు మహేశ్ షెట్టి ఆరోపించారు. ఆయన ఆహారం అడిగేటప్పటికి అర్ధరాత్రి దాటి 12.30 గంటలు అయిందని, నిబంధనలు ఉల్లంఘించి కిచెన్ను ఎలా ఓపెన్ చేస్తామని చెప్పారు. ఆయనపై ఫిర్యాదు చేశామని, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుంటే పై అధికారులను కలుస్తామని పేర్కొన్నారు.
అయితే, క్యాషియర్కు, ఏపీఐకి మధ్య వాగ్వివాదం జరిగిన తర్వాతే ఈ ఘటన జరిగినట్టు ముంబై సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వాస్తవంగా ఏం జరిగిందనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.