లౌకికవాదం గురించి మాట్లాడొద్దు: కాంగ్రెస్కు కెప్టెన్ చురక
ABN , First Publish Date - 2021-10-22T01:01:58+05:30 IST
donot talk about secularism says amarindar to congress
చండీగఢ్: లౌకికవాదం గురించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడాల్సిన అవసరం లేదని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మాజీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. ‘అమరీందర్లోని లౌకికత్వం చనిపోయినట్లు ఉంది’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జీ హరీష్ రావత్ చేసిన వ్యాఖ్యలకు బదులుగా అమరీందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు, బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు చెందిన అనేక మంది నేతల్ని పార్టీలో చేర్చుకోవడం, నవజ్యోత్ సింగ్ సిద్ధూని పార్టీ చీఫ్ చేయడాన్ని ఆయన ఎత్తి చూపారు.
వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీ కంటే పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న హరీష్ రావత్ లక్ష్యంగా ఎక్కువగా స్పందిస్తున్నారు. అమరీందర్ను ముఖ్యమంత్రిగా తప్పించడం నుంచి, సిద్ధూకి పార్టీ బాధ్యతలు అప్పగించడం వరకు అన్ని తతంగాలు రావత్ దగ్గర ఉండి చూసుకున్నారు. ఇదే కోపం అమరీందర్కు ఉందని విశ్లేషకులు అంటున్నారు. అమరీందర్ వ్యాఖ్యలను అతడి మీడియా సలహాదారు రవీన్ తుక్రల్ ట్వీట్ చేస్తూ ‘‘లౌకికవాదం గురించి మాట్లాడటం ఆపేయండి హరీష్ రావత్ జీ. బీజేపీకి చెందిన వ్యక్తుల్ని కాంగ్రెస్లోని తీసుకుంటున్నారు. నానా పటోలే, రేవంత్ రెడ్డి లాంటి ఆర్ఎస్ఎస్ నేతల్ని చేర్చుకుంటున్నారు. శివసేనతో పొత్తు ఎటువంటిది?’’ అని ట్వీట్ చేశారు.