బీజేపీ-ఎన్సీపీ సర్కారును కోరుకున్న మోదీ!
ABN , First Publish Date - 2021-12-31T08:59:13+05:30 IST
మహారాష్ట్రలో 2019లో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా కోరుకున్నారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు.

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామన్నారు.. అసాధ్యమని చెప్పా: పవార్ వెల్లడి
పుణె, డిసెంబరు 30: మహారాష్ట్రలో 2019లో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా కోరుకున్నారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. అయితే, అది అసాధ్యమని తాను మోదీకి స్పష్టం చేసినట్లు తెలిపారు. మరాఠీ దినపత్రిక లోక్సత్తా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడించారు. ఈ విషయమై ప్రధాని మోదీని తాను పలుమార్లు కలిసినట్లు చెప్పారు. దీనికి ప్రధాని ఎలా స్పందించారని అడగ్గా.. ‘ఆలోచించండి’ అని మోదీ చెప్పారన్నారు. అప్పట్లో అజిత్ పవార్ను తాను బీజేపీలోకి పంపించలేదని, అలా చేస్తే ఫడణవీస్ సర్కారు కొనసాగి ఉండేది కదా? అని మరో ప్రశ్నకు సమాధానంగా శరద్ పవార్ చెప్పారు. కాగా, ఈ విషయాన్ని పవార్ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందోనని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.