ప్రభుత్వ ఆధ్వర్యంలో మొబైల్ టీ దుకాణాలు
ABN , First Publish Date - 2021-12-16T16:22:44+05:30 IST
రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో మొబైల్ టీ దుకాణాలు రోడ్లపైకెక్కాయి. రూ.2 కోట్ల విలువైన 20 మొబైల్ టీ దుకాణాల సేవలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సచివాలయ ప్రాంగణంలో బుధవారం జెండా ఊపి లాంఛనంగా
- ప్రారంభించిన సీఎం స్టాలిన్
ప్యారీస్(చెన్నై): రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో మొబైల్ టీ దుకాణాలు రోడ్లపైకెక్కాయి. రూ.2 కోట్ల విలువైన 20 మొబైల్ టీ దుకాణాల సేవలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సచివాలయ ప్రాంగణంలో బుధవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎస్.ముత్తుస్వామి, పరిశ్రమల శాఖ మంత్రి అన్బరసన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరుణ్రాయ్, పరిశ్రమల వాణిజ్య శాఖ డైరెక్టర్ సుజి థామస్, హౌసింగ్ బోర్డు శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి హితేష్కుమార్ మక్వానా, డైరెక్టర్ శరవణవేల్ రాజ్, ప్రభుత్వ పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొబైల్ టీ దుకాణాల ప్రారంభోత్సవం సందర్భంగా ఇండ్కోసర్వ్ సీఈఓ సుప్రియసాహు మీడియాతో మాట్లాడుతూ... తేయాకు ఉత్పత్తి చేస్తున్న రైతుల సంక్షేమార్థం తమ శాఖ తేయాకు టీ విక్రయాలను విస్తరింపజేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. గిరిజనులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాన్న దృక్పథంతో రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన నిధులతో తొలిదశగా చెన్నై, కోయంబత్తూర్, నీలగిరి, తిరుప్పూర్, వేలూరు జిల్లాల్లో మొబైల్ టీ దుకాణాలు పరిచయం చేసినట్టు తెలిపారు. ఈ దుకాణాల ద్వారా టీ, కాఫీ, చిరుధాన్యాలతో తయారుచేసిన వంటకాలు తక్కువ ధరకు విక్రయించనున్నట్టు ఆమె తెలిపారు. ఇదిలా వుండగా హౌసింగ్ బోర్డు, నగరాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మదురై నగరం, కూడల్ పుదూర్ ప్రాంతాల్లో రూ.5 కోట్లతో నిర్మించిన జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయ భవనాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించారు.