మాకు పదవులు ముఖ్యం కాదు :మంత్రి ఎస్పీ వేలుమణి
ABN , First Publish Date - 2021-02-26T13:42:32+05:30 IST
తమకు పదవులు ముఖ్యం కాదని, సంక్షేమ పథకాలు అమలుచేయడమే ప్రధాన లక్ష్యమని స్థానిక సంస్థల శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి స్పష్టం చేశారు. కోయంబత్తూర్ ఆర్ఏ పురం టీబీ రోడ్డులో ‘స్మార్ట్ సిటీ’ పథకంలో అన్ని...

చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): తమకు పదవులు ముఖ్యం కాదని, సంక్షేమ పథకాలు అమలుచేయడమే ప్రధాన లక్ష్యమని స్థానిక సంస్థల శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి స్పష్టం చేశారు. కోయంబత్తూర్ ఆర్ఏ పురం టీబీ రోడ్డులో ‘స్మార్ట్ సిటీ’ పథకంలో అన్ని హంగులతో రూపొందించిన రోడ్డును ప్రజల సందర్శనార్థం బుధవారం రాత్రి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2011లో కోవై పట్టణంలోని రోడ్లు ఎలా వుండేవో అందరికీ తెలుసన్నారు. అన్నాడీఎంకే అధికారం చేపట్టిన వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టడంతో 80 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేలా ఫ్లై ఓవర్ల ఏర్పాటుతో 20 నిముషాల్లోనే ప్రజలు పొల్లాచ్చికి వెళుతున్నారని తెలిపారు. పట్టణంలో మెట్రోరైలు పథకాన్ని అనుమతించడంతో పాటు నిధులు కూడా కేటాయించామన్నారు. ఓట్ల కోసం మాత్రమే ప్రజలను తాము కలుసుకోవడం లేదని, వారి సమస్యలను పరిష్కరించేందుకు వారి వద్దకు వెళుతున్నామని అన్నా రు. స్థానిక సంస్థల శాఖ మంత్రిగా స్టాలిన్ ఉన్న హయాంలో కోవై ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రస్తుతం అన్ని హంగులతో కోవై ఆవిర్భవించడాన్ని జీర్ణించుకోలేని స్టాలిన్ తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.