బెంగాల్ రైతులకు మమత అన్యాయం: నడ్డా

ABN , First Publish Date - 2021-02-06T23:02:01+05:30 IST

ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి యోజనను రాష్ట్రంలో ప్రవేశపెట్టకుండా పశ్చిమబెంగాల్ ప్రజలకు..

బెంగాల్ రైతులకు మమత అన్యాయం: నడ్డా

మాల్డా: ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి యోజనను రాష్ట్రంలో ప్రవేశపెట్టకుండా పశ్చిమబెంగాల్ ప్రజలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్యాయం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మమత మొండి వైఖరి, అహంకారం వల్ల 70 లక్షల మంది రాష్ట్ర ప్రజలు పీఎం కిసాన్ సమ్మన్ నిధి ప్రయోజనాలను పొందలేకపోయారని విమర్శించారు. మల్డా జిల్లాలో బీజేపీ రోడ్‌షోలో నడ్డా శనివారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పథకం అమలు చేయడం లేదంటూ సుమారు 25 లక్షల మంది ప్రజలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, దీంతో మమత సైతం రాష్ట్రంలో పథకం అమలు చేయబోతున్నట్టు ప్రకటించారని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందునే మమత ఆ ప్రకటన చేశారని, అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నడ్డా అన్నారు. నష్టం జరిగిపోయిన తర్వాత చింతిస్తే ప్రయోజనం ఏమిటని మమత సర్కార్‌ను నిలదీశారు.


పరివర్తన్ యాత్ర షురూ..

బీజేపీ చేపట్టిన 'పరివర్తన్ యాత్ర'ను నబడ్‌విప్‌లో జెండా ఊపి నడ్డా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మతా బెనర్జీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. 'ఇదొక నిరంకుశ ప్రభుత్వం. 130 మందికి పైగా బీజేపీ కార్యకర్తలను చంపేశారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు. చివరకు మాపై కూడా దాడులు జరుపుతున్నారంటే బెంగాల్‌లో సామాన్య జనం పరిస్థితి ఏమిటో నేను ఆర్థం చేసుకోగలను' అని నడ్డా అన్నారు.


ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌కు ప్రతీదీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని, మమతా బెనర్జీ మాత్రం 'వద్దు వద్దు' అంటూనే వచ్చారని, ఏది ఇస్తామన్నా ఆమె నోట ఇదే మాటవినిపిస్తుందని నడ్డా అన్నారు. మే తరువాత రాష్ట్రానికి అన్నీ వస్తాయని నడ్డా భరోసా ఇచ్చారు.


పరివర్తన్ యాత్ర ఇక్కడి నుంచి మొదలైందని, ప్రభుత్వ మార్పే కాకుండా ఆలోచనలో కూడా మార్పు చోటుచేసుకోనుందని నడ్డా అన్నారు. తల్లి, జన్మభూమి, ప్రజలు అనే నినాదంతో పదేళ్ల క్రితం ఇక్కడ ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ ఏర్పాటు చేశారని, తల్లిని లూటీ చేశారని, మట్టిని అగౌరవపరిచారని, మనుషులకు రక్షణ లేకుండా చేశారని విమర్శలు గుప్పించారు.

Updated Date - 2021-02-06T23:02:01+05:30 IST