లోన్ యాప్ రాకెట్ను ఛేదించిన పోలీసులు... ఇద్దరు చైనా పౌరులతో పాటు...
ABN , First Publish Date - 2021-01-03T16:25:56+05:30 IST
లోన్ యాప్ రాకెట్ను తమిళనాడు పోలీసులు ఛేదించారు. ఈ ఉదంతంలో...
చెన్నై: లోన్ యాప్ రాకెట్ను తమిళనాడు పోలీసులు ఛేదించారు. ఈ ఉదంతంలో పోలీసులు ఇద్దరు చైనా పౌరులతో పాటు వారికి సహకరించిన మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన ఈ నలుగురు రుణం తీసుకున్నవారిని... వసూళ్ల కోసం ఫోన్లుచేసి వేధిస్తుంటారని పోలీసుల విచారణలో తేలింది. ఆన్లైన్ లోన్ వేధింపులకు సంబంధించిన ఒక ఫోన్ కాల్ ఆధారంగా చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. దీనిపై ఫిర్యాదు చేసిన వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం లాక్డౌన్ సమయంలో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నానని, అదే సమయంలో లోన్ యాప్ ద్వారా రూ. 5000 రుణం తీసుకున్నానని తెలిపారు.
దానికి రూ. 1500 వడ్డీ కింద మినహాయించుకుని రూ. 3,500 తన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశారన్నారు. తరువాత వారు నూటికి రెండు రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేశారని, అప్పటినుంచి బెదిరింపు కాల్స్ మొదలయ్యాయని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు చెన్నై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. ఆధునిక సాంతకేతికతను వినియోగించి, నిందితులు బెంగళూరులోని ఒక కాల్ సెంటర్ నుంచి ఫోన్లు చేస్తున్నారని గుర్తించారు. ఈ కాల్ సెంటర్ను ప్రమోద్, పావన్లు నిర్వహిస్తున్నారని వెల్లడయ్యింది. దీనిలో 110 మంది పనిచేస్తున్నారని, వీరు వివిధ రకాలైన 9 యాప్ల ద్వారా రుణాలు ఇప్పించే పనిచేస్తుంటారని తేలింది. విచారణ చేపట్టిన పోలీసులు ప్రమోద్, పావన్లు తెలిపిన ఆధారాల మేరకు ఇద్దరు చైనా పౌరులతో పాటు మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిని న్యాయస్థానానికి అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.