Kerala : Ice Cream అనుకున్నారు, కానీ అది Bomb!
ABN , First Publish Date - 2021-11-23T22:26:29+05:30 IST
కేరళలోని ధర్మడోమ్లో సోమవారం దారుణం జరిగింది.
కొజిక్కోడ్ : కేరళలోని ధర్మడోమ్లో సోమవారం దారుణం జరిగింది. ముగ్గురు బాలురు ఇంటి ముందు ఆడుకుంటుండగా ఐస్ క్రీమ్ కంటెయినర్లు కనిపించాయి. అవి తినే ఐస్ క్రీమ్ అనుకున్నారు. వాటిలోని ఓ ఐస్ క్రీమ్ కంటెయినర్ పేలడంతో గాయపడిన ఓ బాలుడిని ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఆ బాలునికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కన్నూర్లోని ధర్మడోమ్ సమీపంలో ఉన్న పలయాడ్లో పవిత్రన్, దివ్య దంపతులు నివసిస్తున్నారు. వారి కుమారుడు శ్రీవర్ధ్ ఇంటి ముందు మరో ఇద్దరితో కలిసి బంతితో ఆడుకుంటున్నారు. ఆ బంతి సమీపంలోని హాస్టల్ గోడ వద్ద పడింది. వారు తమ బంతిని వెతుకుతుండగా, పొదల్లో బంతి ఆకారంలో ఉన్న మూడు ఐస్ క్రీమ్ కంటెయినర్లు కనిపించాయి.. అవి వాస్తవానికి క్రూడ్ బాంబులు. ఆ విషయం తెలియక ఆ బాలురు వాటిని ఐస్ క్రీమ్ అనుకుని తీసుకున్నారు. శ్రీవర్ధ్ తన వద్దనున్న కంటెయినర్ను పైకి విసిరాడు. అది పేలడంతో గాయపడ్డాడు. వెంటనే ఆ బాలుడిని తలసేరిలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
మిగిలిన రెండు ఐస్ క్రీమ్ బాంబులను బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసిందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో పోలీసులు, బాంబు స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.