ఉగ్రవాదుల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
ABN , First Publish Date - 2021-10-25T06:28:59+05:30 IST
కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో పది రోజుల క్రితం తొమ్మిది మంది జవాన్ల మృతికి కారకులైన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది.

‘పూంచ్’లో భద్రతాదళాల సెర్చ్ ఆపరేషన్
కస్టడీలో ఉన్న ‘లష్కరే’ ముష్కరుడి హతం
షోపియాన్, అక్టోబరు 24 : కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో పది రోజుల క్రితం తొమ్మిది మంది జవాన్ల మృతికి కారకులైన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేయడమే లక్ష్యంగా భద్రతా దళాలు, పోలీసులు జిల్లాలోని భత్తా దూరియన్ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. గతంలో ఈ అడవి కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించిన పాకిస్థాన్కు చెందిన లష్కరే తైబా ఉగ్రవాది జియా ముస్తఫా ప్రస్తుతం పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. దీంతో స్థావరాల ఆచూకీని చెప్పేందుకుగానూ భద్రతా దళాలు ఆదివారం ఉదయం అతన్ని తమ వెంట భత్తా దూరియన్ అడవికి తీసుకెళ్లాయి. అయితే భద్రతా దళాల అలికిడిని గుర్తించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఉగ్రవాది జియా ముస్తఫా అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు పోలీసు సిబ్బంది, ఓ ఆర్మీ జవాన్కు గాయాలయ్యాయి.
కాగా, కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల ఘటనలో ఓ పౌరుడు మృతిచెందాడు. పట్టణంలోని బాబాపుర ప్రాంతంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు గస్తీ నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎ్ఫ)పై అకస్మాత్తుగా మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. వారిని తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపాయి. ఈక్రమంలో ఆ పరిసరాల్లోనే ఉన్న స్థానిక యాపిల్ విక్రయదారుడు షాహిద్ ఎజాజ్ (23)కు బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. ‘‘భద్రతా దళాల ఆయుధాలను దొంగిలించేందుకు మిలిటెంట్లు యత్నించిన క్రమంలోనే సీఆర్పీఎఫ్ ఎదురు కాల్పులు జరిపిందని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి’’ అని ఓ ఆంగ్ల వార్తాసంస్థ పేర్కొంది.