ఆమె నటనకు ఆస్కార్ award ఇవ్వొచ్చు!
ABN , First Publish Date - 2021-10-17T14:18:39+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధిని సందర్శించేందుకు వెళ్లే లక్షలాదిమందిలో వీకే శశికళ ఒకరని, ఆమె మెరీనా సందర్శనలో ఇంతకు మించిన విశేషమేమీ లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత డి.జయకుమార్ వ్యా
- అన్నాడీఎంకే నేత డి. జయకుమార్
ప్యారీస్(chennai): మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధిని సందర్శించేందుకు వెళ్లే లక్షలాది మందిలో వీకే శశికళ ఒకరని, ఆమె మెరీనా సందర్శనలో ఇంతకు మించిన విశేషమేమీ లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత డి.జయకుమార్ వ్యాఖ్యానించారు. జయ సమాధి వద్ద శశికళ భావోద్వేగానికి గురవడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఆమె నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎగసెక్కాలాడారు. ఆయన నగరంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ... అవినీతిని అంతమొందించేందుకు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ప్రారంభించిన అన్నాడీఎంకే అధికారంలో వున్నా, లేకున్నా ప్రజల పక్షాన పోరాడుతుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్లిన సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయన్నారు. అన్నాడీఎంకే ఏనుగులాంటిదని, ఆ ఏనుగుపై శశికళ దోమలాంటిదని, దోమ ఏనుగును మోస్తున్నట్టు చెప్పుకొంటూ గొప్పలు చెప్పుకునే తరహాలోనే శశికళ కూడా తానే పార్టీలో గొప్ప నాయకురాలినని చెప్పుకుంటోందంటూ ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే పార్టీ జెండాను వినియోగించుకొనేందుకు శశికళకు నైతిక హక్కు లేదని, ఆమె చట్టవిరుద్ధంగా పలుమార్లు అన్నాడీఎంకే జెండా ఉన్న కారులో ప్రయాణం చేసి, పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం శాశ్వతంగా కావాలనుకుంటే శశికళ ఏఎంఎంకే పార్టీ పగ్గాలు చేపట్టవచ్చని, ఇందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. పార్టీలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్కు చోటు కల్పించడంలో తప్పు లేదని, అయితే శశికళకు మాత్రం పార్టీ తలుపులు మూసే వుంటాయని జయకుమార్ వ్యాఖ్యానించారు.