గాజా విషయంలో భారత్ వైఖరి కొత్తదేమీ కాదు : విదేశాంగ శాఖ
ABN , First Publish Date - 2021-06-04T01:30:52+05:30 IST
గాజా హింసాకాండపై దర్యాప్తునకు సంబంధించిన తీర్మానంపై భారత దేశ
న్యూఢిల్లీ : గాజా హింసాకాండపై దర్యాప్తునకు సంబంధించిన తీర్మానంపై భారత దేశ వైఖరి కొత్తదేమీ కాదని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గాజా హింసాకాండపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా గతంలో కూడా గైర్హాజరైన విషయాన్ని గుర్తు చేసింది.
గాజా హింసాకాండపై దర్యాప్తునకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి తీర్మానంపై ఓటింగ్లో భారత దేశం పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు పాలస్తీనా విదేశాంగ మంత్రి ఓ లేఖ రాశారు. ఈ లేఖ గురించి గురువారం మీడియా ప్రతినిధులు ప్రశ్నించినపుడు భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ, పాలస్తీనా ఇటువంటి లేఖలను ఈ తీర్మానంపై ఓటింగ్కు గైర్హాజరైన ఇతర దేశాలకు కూడా రాసిందన్నారు. తాము తీసుకున్న వైఖరి కొత్తదేమీ కాదన్నారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్లు తెలిపారు.
మే నెలలో 11 రోజులపాటు ఇజ్రాయెల్-హమస్ మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు పాలస్తీనీయులే.