చెన్నై మహానగరంలో మళ్లీ కరోనా విలయం..
ABN , First Publish Date - 2021-04-05T16:30:33+05:30 IST
చెన్నై మహానగరంలో కరోనా వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా దూసుకొస్తోంది.
- 846 కంటైన్మెంట్ జోన్లలో నిఘా
- 20వేల మందికి కరోనా చికిత్స
- కోయంబేడు మార్కెట్ వేళల తగ్గింపు?
చెన్నై/అడయార్ : చెన్నై మహానగరంలో కరోనా వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా దూసుకొస్తోంది. రోజురోజుకూ నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖతో కలిసి చెన్నై నగర కార్పొరేషన్ వైద్య విభాగం అధికారులు చర్యలు నిమగ్నమయ్యారు. అయితే, గత యేడాది చెన్నై నగరంలో కరోనా హాట్స్పాట్గా మారిన కోయంబేడు మార్కెట్పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నెలలో నాలుగు రోజుల పాటు మూసి వేయాలని, ప్రతి రోజూ విక్రయ సమయ వేళలను కూడా తగ్గించాలని భావిస్తున్నారు. ఈ మార్కెట్కు పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో కూరగాయల లోడుతో లారీలు వస్తుంటాయి.
అలాగే, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల అనేక మంది వ్యాపారులు వచ్చి కూరగాయలను కొనుగోలు చేస్తుంటారు. అలాగే, రోజుకు దాదాపు లక్షమంది వరకు కొనుగోలుదారులు వచ్చి పోతుంటారు. అయితే, ఎలాంటి భౌతికదూరం పాటించకుండా మార్కెట్లోకి వస్తుండ టంతో అధికారులు ప్రత్యేక నిఽఘా సారించారు. ముఖ్యం గా మార్కెట్కు వచ్చే కొనుగోలుదారులు, వ్యాపారులు కోవిడ్ మార్గదర్శకాలను పాటించని వారిని గుర్తించి అపరాధం కూడా వసూలు చేస్తున్నారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే లారీ డ్రైవర్లు, క్లీనర్లకు విధిగా కరోనా నిర్థారణ పరీక్షలు చేసిన తర్వాతే మార్కెట్లోకి అనుమతిస్తున్నారు.
అదేవిధంగా మార్కెట్ ప్రాంగణం లోనే ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే సీసీ కెమెరాల ద్వారా మార్కెట్ ప్రాంగణమంతా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అదేసమయంలో తదుపరి చర్యల్లో భాగంగా మార్కెట్ పనిచేసే సమయాన్ని తగ్గించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు రోజుల సెలవును నాలుగు రోజులుగా చేయనున్నారు. అదేవిధం గా చిల్లర వ్యాపారులను మినహాయించి, నగర వాసులను మార్కెట్లోకి ప్రవేశించకుండా నియంత్రించా లని కోయంబేడు మార్కెట్ వ్యాపారుల కమిటీ భావిస్తోంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కొత్త నిబంధనలను అమలు చేయాలని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు.
రేపు మార్కెట్ మూసివేత
ఈనెల 6వ తేదీన కోయంబేడు మార్కెట్కు సెలవు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని కార్మిక శాఖ ఆదేశాలు జారీచేసింది.
మినీ కంటైన్మెంట్ జోన్లపై దృష్టి
రాష్ట్రంలో ఇప్పటిరకు 8,96,226 మందికి కరోనా సోకింది. రాష్ట్రవ్యాప్తంగా 20204 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ సోకి శనివారం ఒక్కరోజే 24 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ సార థ్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇదిలావుండగా, ప్రస్తుతం రాష్ట్రంలో 846 మినీ కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు.