Pakistan:దేవాలయంపై దాడి ఘటనపై సుప్రీం విచారణ
ABN , First Publish Date - 2021-08-06T13:26:10+05:30 IST
పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో సిద్ధి వినాయక ఆలయంపై దుండగుల దాడి ఘటనపై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు....
ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆలస్యంగా ఖండన
లాహోర్ : పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో సిద్ధి వినాయక ఆలయంపై దుండగుల దాడి ఘటనపై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. దేవాలయంపై దాడి ఘటనపై పాక్ హిందూ కౌన్సిల్ చీఫ్ ప్యాట్రన్ రమేష్ కుమార్ వాంక్వానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ ను కలిశారు.ఈ ఘటనపై శుక్రవారం (నేడు) విచారణ చేపట్టనున్నందున విచారణకు హాజరు కావాలని పంజాబ్ ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ, పోలీసు చీఫ్ లను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.రహీంయార్ ఖాన్ జిల్లా భోంగ్ నగరంలో బుధవారం రాత్రి ఆలయంపై దుండగులు ఇనుప రాడ్లు, కర్రలు, కట్టెలు తీసుకొని దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై భారతదేశం స్పందించి పాకిస్థాన్ దేశంలోని మైనారిటీల భద్రతకు భరోసా కల్పించాలని కోరింది. దీంతో స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆలయంపై జరిగిన దాడిని ఖండించారు. ఆలయంపై దాడికి పాల్పడిన దోషులందరినీ అరెస్టు చేయాలని తాను ఐజీని ఆదేశించడంతో పాటు ఆలయాన్ని పునరుద్ధరిస్తామని ఇమ్రాన్ ఖాన్ ఆలస్యంగా ట్వీట్ చేశారు.