Padma Bhushan awardee: లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-11-11T14:38:45+05:30 IST
ప్రజా జీవితంలో తన సుదీర్ఘ సేవలకు పద్మభూషణ్ అవార్డు అందుకున్న లోక్సభ మాజీ స్పీకర్, బీజేపీ సీనియర్ నాయకురాలు సుమిత్రా మహాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు...
ఇండోర్: ప్రజా జీవితంలో తన సుదీర్ఘ సేవలకు పద్మభూషణ్ అవార్డు అందుకున్న లోక్సభ మాజీ స్పీకర్, బీజేపీ సీనియర్ నాయకురాలు సుమిత్రా మహాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోలేదని, ఎప్పటికీ బీజేపీ కార్యకర్తగానే ఉంటానని సుమిత్రా స్పష్టం చేశారు.‘‘బీజేపీ ఆఫీస్ బేరర్లు నన్ను పార్టీ ప్రయోజనాల కోసం ఏ పని చేయమని అడిగితే,ఆ పని నేను చేస్తాను. నేను సామాజిక సేవా రంగంలో కూడా పని చేస్తాను’’ అని సుమిత్రా మహాజన్ విలేకరులతో చెప్పారు.‘తాయ్’గా పేరుగాంచిన సుమిత్ర మహాజన్ వయసు 78 ఏళ్లు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తు చేసుకుంటూ, రాజకీయ కార్యకర్త ఏ పదవిలో లేకపోయినా అలాగే ఉంటారని ఆమె చెప్పారు.
ఢిల్లీలో అవార్డు తీసుకొని తిరిగి వచ్చిన సుమిత్రా మహాజన్కు ఇక్కడి దేవి అహిలీబాయి హోల్కర్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇండోర్ బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీ, మధ్యప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి తులసీరామ్ సిలావత్ తదితరులు సుమిత్రకు స్వాగతం పలికారు.‘‘ఈ రోజు కూడా నేను రాజకీయ కార్యకర్తనే, ఎప్పటికీ అలాగే ఉంటాను’’ అని ఆమె అన్నారు.సుమిత్ర మహాజన్ 1989 నుంచి 2014 వరకు ఇండోర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది సార్లు గెలిచారు.75 ఏళ్లు దాటిన నేతలను పోటీకి అనుమతించని బీజేపీ నిర్ణయంతో 2019 ఎన్నికల్లో పోటీ చేయకూడదని సుమిత్ర మహాజన్ నిర్ణయించుకున్నారు.