1,100 ఏళ్ల కిందటే ఆస్పత్రి
ABN , First Publish Date - 2021-05-20T07:39:10+05:30 IST
ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తమిళనాట చోళరాజులు వెయ్యేళ్ల క్రితమే ఆస్పత్రులు నిర్మించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది

కంచి సమీపాన 15 పడకలతో పురాతన వైద్యశాల!
చోళరాజులు నిర్మించినట్లు ఆలయ శిలాశాసనం
చెన్నై, మే 19(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తమిళనాట చోళరాజులు వెయ్యేళ్ల క్రితమే ఆస్పత్రులు నిర్మించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కాంచీపురం సమీపంలోని ఓ ఆలయంలో ఇటీవల వెలుగుచూసిన శిలాశాసనంలో ఈ సంగతి వెల్లడైంది. సుమారు 1,100 ఏళ్లకు పూర్వం సెయ్యారు, వేగవతి, పాలారు అనే మూడు నదులు కలిసేచోట వీరరాజేంద్ర చోళుడు 15 పడకల సదుపాయంతో ఓ ఆస్పత్రిని నిర్మించి, ఇద్దరు వైద్యులను నియమించాడు. వీరిలో ఒకరు శస్త్రచికిత్సలో నిపుణులు. వీరితో పాటు తేలికపాటి శస్త్రచికిత్సల కోసం ఓ క్షురకుడు, మూలికలను సేకరించి, మందులు తయారు చేయడానికి ఇద్దరు సహాయకులు, రోగుల సంరక్షణకు మహిళా సేవకులను కూడా నియమించారు. వీరందరికీ వైద్యసేవలను బట్టి వరిధాన్యాలను వేతనంగా చెల్లించేవారు. ఈ వివరాలన్నీ కాంచీపురం సమీపంలోని తిరుముక్కూడల్ వద్ద ఉన్న వేంకటేశ పెరుమాళ్ ఆలయ శిలాశాసనంలో చక్కటి తమిళంలో పొందుపరచి ఉన్నట్లు పురావస్తు పరిశోధకులు పేర్కొన్నారు.