కేరళలో హిందువులుగా మారినవారే ఎక్కువ!
ABN , First Publish Date - 2021-04-02T18:20:49+05:30 IST
కేరళ శాసన సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలో
తిరువనంతపురం : కేరళ శాసన సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలో బలవంతపు మతమార్పిడుల నిరోధక చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చింది. హిందువులు, క్రైస్తవులను మచ్చిక చేసుకోవడం కోసం ఈ హామీ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, మత మార్పిడుల్లో ఎక్కువ లబ్ధి పొందుతున్నది హిందూ మతమేనని వెల్లడైంది. కేరళ ప్రభుత్వ గెజిట్ను పరిశీలించినపుడు ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
2020లో కేరళలో 506 మంది మతం మారారు. వీరిలో 241 మంది (క్రైస్తవులు లేదా ముస్లింలు) హిందూ మతం స్వీకరించారు. ఇస్లాం మతంలోకి మారినవారి సంఖ్య 144 కాగా, క్రైస్తవం స్వీకరించినవారు 119 మంది. గణాంకాలను పరిశీలించినపుడు దళిత క్రైస్తవులు ఎక్కువగా హిందూ మతంలోకి మారుతున్నట్లు వెల్లడైంది. 32 మంది ముస్లింలు హిందూ మతంలోకి మారినట్లు వెల్లడైంది.
2020లో 242 మంది క్రైస్తవాన్ని విడిచిపెట్టగా, కొత్తగా ఆ మతం స్వీకరించినవారి సంఖ్య 119. ఇస్లాంలోకి కొత్తగా 144 మంది చేరగా, 40 మంది ఆ మతాన్ని విడిచిపెట్టారు. హిందూ మతం నుంచి ఇద్దరు వ్యక్తులు బౌద్ద మతంలోకి చేరారు. ఇస్లాం స్వీకరించినవారిలో 77 శాతం మంది హిందువులే.
వ్యక్తులు తమ మతాన్ని అధికారికంగా మార్చుకోవాలంటే, ప్రభుత్వ గెజిట్లో ప్రకటించవలసి ఉంటుంది.