2014 నుంచి గంగా నది నాణ్యత మెరుగు
ABN , First Publish Date - 2021-10-25T06:25:50+05:30 IST
గంగా నది నాణ్యత 2014 నుంచి మెరుగుపడిందని, నదిలో కనిష్ఠ స్థాయి కన్నా ఎక్కువగా ఆక్సిజన్ ఉందని అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీ, అక్టోబరు 24: గంగా నది నాణ్యత 2014 నుంచి మెరుగుపడిందని, నదిలో కనిష్ఠ స్థాయి కన్నా ఎక్కువగా ఆక్సిజన్ ఉందని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ నుంచి పశ్చిమ బెంగాల్లోని ఉలూబెరియా వరకు నది నాణ్యత పెరిగిందని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ చెప్పారు. ఆదివారం పీటీఐతో ఆయన మాట్లాడారు. నది ప్రవహించే ప్రాంతాల్లో 27 చోట్ల ఆక్సిజన్ స్థాయులు పెరిగాయని, అలాగే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), ఫీకల్ కోలిఫాం (ఎఫ్సీ) కూడా మెరుగయ్యాయని ఆయన తెలిపారు. నీటిలో ఆక్సిజన్ స్థాయులు ఎక్కువగా ఉంటే, ఆ నీటిలో నివసించే జీవులకు అనుకూలమని, బీఓడీ తక్కువగా ఉంటే ఆ నీటిలో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల పరిమాణం తక్కువగా ఉన్నట్లు అర్థమని ఆయన వివరించారు.