నవోదయ విద్యాలయలో 14 మంది విద్యార్థులకు Covid positive...రెండు వారాలు పాఠశాల మూసివేత
ABN , First Publish Date - 2021-11-24T15:34:29+05:30 IST
జవహర్ నవోదయ విద్యాలయలో 14మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైంది...
చండీఘడ్ (పంజాబ్): జవహర్ నవోదయ విద్యాలయలో 14మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైంది. పంజాబ్ రాష్ట్రంలోని ముక్తసర్ జిల్లా వేరింగ్ ఖేరా గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయలో 14 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో వారిని పాఠశాల హాస్టల్ గదిలోనే ఐసోలేషన్ చేశారు. 8వతరగతికి చెందిన 12 మంది విద్యార్థులు, 9వతరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా సోకిన వారిని ఇళ్లకు పంపిస్తే వారి కుటుంబసభ్యులకు కూడా కరోనా ప్రబలుతుందని అందువల్ల వారిని హాస్టల్ ఐసోలేషన్ గదికి తరలించామని నవోదయ ఉపాధ్యాయులు చెప్పారు.కరోనా వ్యాపించకుండా నివారించేందుకు వీలుగా నవోదయ విద్యాలయను రెండు వారాల పాటు మూసివేశామని ఉపాధ్యాయులు చెప్పారు.
పంజాబ్ రాష్ట్రంలో కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ ఆగస్టు 2వతేదీ నుంచి పాఠశాలలు తెరిచారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, భోదనేతర సిబ్బంది రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి గతంలో ఆదేశించారు. విద్యార్థులకు కరోనా సోకిన దృష్ట్యా నవోదయ పాఠశాలను శానిటైజ్ చేశారు. నవోదయ విద్యాలయంలో 14 మంది పిల్లలకు కరోనా సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.