27న జయ స్మారక మందిరం ప్రారంభం
ABN , First Publish Date - 2021-01-20T12:18:16+05:30 IST
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారక మందిరం ప్రారంభోత్సవం ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగనుంది. ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం సమక్షంలో...

ప్యారీస్: దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారక మందిరం ప్రారంభోత్సవం ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగనుంది. ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం సమక్షంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రారంభిస్తారు. స్థానిక మెరీనా బీచ్ తీరంలో మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమాధి వద్దే జయలలిత స్మారక మందిరం నిర్మితమైంది. ఈ ప్రారంభోత్సవంలో అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, సంక్షేమ బోర్డు ఛైర్మన్లు, అన్నాడీఎంకే శ్రేణులు పాల్గొననున్నారు. జయలలిత నివసించిన పోయస్ గార్డన్లోని ‘వేద నిలయం’ను ప్రభుత్వపరం చేసి స్మారక మందిరంగా తీర్చిదిద్దారు. ప్రజాపనుల శాఖ చేపట్టిన పనులు దాదాపు 95 శాతం పూర్తవడంతో అదే రోజే ప్రజలను సందర్శనకు అనుమతిస్తారు. కాగా, అక్రమాస్తుల కేసులో జైలుపాలైన వీకే శశికళ ఈనెల 27వ తేదీ విడుదలయ్యే అవకాశముంది. ఆ రోజే జయలలిత స్మారక మందిరాన్ని ప్రారంభించడం గమనార్హం.