రైలు ఏపీ వెళ్లదని తెలిసి దూకేసిన ఐదుగురు ప్రయాణికులు.. ఒకరు మృతి..

ABN , First Publish Date - 2021-06-24T22:48:38+05:30 IST

వేరే రైలు ఎక్కామన్న కంగారులో ఐదుగురు ప్రయాణికులు కదులుతున్న రైల్లో నుంచి దూకేసిన వైనమిది. ఈ ఘటనలో ...

రైలు ఏపీ వెళ్లదని తెలిసి దూకేసిన ఐదుగురు ప్రయాణికులు.. ఒకరు మృతి..

ఝాన్సీ: వేరే రైలు ఎక్కామన్న కంగారులో ఐదుగురు ప్రయాణికులు కదులుతున్న రైల్లో నుంచి దూకేసిన వైనమిది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి యూపీలోని ఝాన్సీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మృతుడిని గోరఖ్‌పూర్‌లోని దేవ్‌కాళి ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (35)గా గుర్తించారు. అజయ్ తన అంకుల్ జగ్‌మోహన్, సోదరుడు విజయ్‌లతో పాటు సహచరులు సందీప్, సంజయ్‌లతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ వెళ్లేందుకు ఝాన్సీకి వచ్చినట్టు ప్రభుత్వ రైల్వే పోలీసులు వెల్లడించారు. రాత్రి 12:30 గంటల సమయంలో ఏపీ రైలు అనుకుని వీరంతా ఢిల్లీ వైపు వెళ్తున్న ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. అయితే ఆ రైలు ఢిల్లీ వెళ్తుందని తెలియడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కదులుతున్న రైల్లోంచి దూకేశారు. అజయ్ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా వారంతా తీవ్రంగా గాయపడడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-24T22:48:38+05:30 IST