CM పై ఎఫ్ఐఆర్ నమోదు..
ABN , First Publish Date - 2021-07-31T22:51:52+05:30 IST
అసోం, మిజోరాం రాష్ట్రాల సీఎస్ల మధ్య శనివారం కీలక భేటీ జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు
గౌహతి : అసోం, మిజోరాం రాష్ట్రాల సీఎస్ల మధ్య శనివారం కీలక భేటీ జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సరిహద్దుల్లో ఉన్న పోలీసులను తిరిగి వెనక్కి పంపాలని, వారి వారి క్యాంపుల్లోకి పంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో దెస్సోయ్ లోయ దగ్గర పోలీసులను మోహరించిన విషయం తెలిసిందే. ‘‘శాంతిని కాపాడాలని ఉభయులమూ నిర్ణయించుకున్నాం. 24 గంటల్లోగా ఈ పని పూర్తి కావాలని ఒప్పందం చేసుకున్నాం’’ అని అధికారులు పేర్కొన్నారు.
అసోం సీఎంపై ఎఫ్ఐఆర్.... సంతోషంగా హాజరవుతా : హిమంత విశ్వశర్మ
ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ నేపథ్యంలో మిజోరాం ప్రభుత్వం అసోం ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అసోం సీఎం హిమంత విశ్వశర్మ స్పందించారు. ‘‘సంతోషంగా నేను విచారణకు హాజరవుతాను. ఎలాంటి విచారణ అయినా ఇబ్బంది లేదు. రాజ్యాంగ బద్ధంగా ఉన్న అసోం భూభాగంలోనే సంఘటన జరిగింది. అలాంటి సమయంలో తటస్థంగా ఉండే దర్యాప్తు సంస్థకు ఎందుకు అప్పగించరు?ఈ విషయాన్ని ఇప్పటికే మిజోరాం సీఎం దృష్టికి తీసుకెళ్లాను’’ అని హిమంత విశ్వశర్మ ట్వీట్ చేశారు.