డిసెంబరు వరకు రైతు ఉద్యమం కొనసాగుతుంది: రాకేశ్ తికాయత్
ABN , First Publish Date - 2021-03-15T01:20:15+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమం
![డిసెంబరు వరకు రైతు ఉద్యమం కొనసాగుతుంది: రాకేశ్ తికాయత్](https://media.andhrajyothy.com/appimg/galleries/2021031407484446/03142021194953n66.jpg)
కోల్కతా: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమం డిసెంబరు వరకు కొనసాగుతుందని రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి అయిన రాకేశ్ తికాయత్ త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని నవంబరు, డిసెంబరకు వరకు కొనసాగించే అవకాశం ఉందన్నారు.
పశ్చిమ బెంగాల్ పర్యటనపై తికాయత్ మాట్లాడుతూ.. ఇక్కడ ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు అన్నంతో చక్కని విందు కావాలని రైతులను అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. క్వింటాల్ ధాన్యానికి రూ. 1850 మద్దతు ధర కావాలని కొనుగోలుదారులను అడగాలని బెంగాల్ రైతులను కోరినట్టు చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించి సాగు చట్టాలకు వ్యతిరేకంగా మద్దతు కూడగడతామన్నారు.
బీహార్లో క్వింటాల్ ధాన్యానికి రూ. 750 నుంచి రూ. 800 ధర మాత్రమే లభిస్తోందని తికాయత్ ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రకాల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించేలా చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.