తగ్గనున్న నూనె ధరలు

ABN , First Publish Date - 2021-10-14T06:48:20+05:30 IST

ఆకాశాన్ని తాకిన వంట నూనెల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తగ్గనున్న నూనె ధరలు

  • బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ ఎత్తివేత
  • రిఫైన్డ్‌ వంట నూనెలపైనా పన్నుల తగ్గింపు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, అక్టోబరు 13: ఆకాశాన్ని తాకిన వంట నూనెల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పామ్‌, సన్‌ఫ్లవర్‌, సోయాబీన్‌ల ముడి వంట నూనెలపై బేసిక్‌ కస్టమ్స్‌ పన్నును కేం ద్రం బుధవారం ఎత్తివేసింది. అలాగే రిఫైన్డ్‌ వంటనూనెలపైనా పన్ను తగ్గించింది. పండుగల సీజన్‌లో సామాన్యులకు ఊరట కల్పిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దిగుమతి పన్ను, సుంకంలో తగ్గుదల ఈ నెల 14 నుంచి 2022 మార్చి 31 వరకు అమల్లో ఉం టుందని పరోక్ష పన్నులు, కస్టమ్‌ల సెంట్రల్‌ బోర్డు (సీబీఐసీ) తెలిపింది. దీంతో వంటనూనెల ధరలు లీటరుకు రూ.15 తగ్గే అవకాశం ఉందని వంట నూనెల పరిశ్రమల సంఘం సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌(ఎస్‌ఈఏ) పేర్కొంది. అలాగే ముడి పామాయిల్‌, ముడి సోయాబీన్‌, ముడి సన్‌ఫ్లవర్‌ నూనెలపైనా కేంద్రం వ్యవసాయ మౌలికసదుపాయాల అభివృద్ధి సుంకాన్ని(ఏఐడీసీ) కూడా తగ్గించింది. గత కొద్ది నెలల్లో పన్నులు తగ్గించడం ఇది నాలుగోసారి. 


రైతులపై భారం పడొచ్చు: ఎస్‌ఈఏ

పండుగల నేపథ్యంలో వంటనూనెల ధరలు తగ్గించి సామాన్యుడికి ప్రభుత్వం ఊరట కల్పించినా, రైతులకు భారంగా పరిణమించవచ్చని ఎస్‌ఈఏ కార్యనిర్వాహక డైరెక్టర్‌ బీవీ మెహతా అన్నారు. ఎందుకంటే నిర్ణయం తీసుకున్న సమయం సరికాదని, సోయాబీన్‌, వేరుసెనగ ఉత్పత్తుల సేకరణ ఇప్పటికే ప్రారంభమైందని ఆయన తెలిపారు.

Updated Date - 2021-10-14T06:48:20+05:30 IST