కేరళలో ఈడీ విచారణకు మాజీ మంత్రి Vijaybhasker
ABN , First Publish Date - 2021-11-30T13:46:39+05:30 IST
తనను రూ.11 కోట్ల మేరకు మోసగించారంటూ ఓ మహిళా పారిశ్రామికవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర మాజీ మంత్రి విజయ్భాస్కర్ను కేరళలోని (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఈడీ అధికారులు విచారించారు.
పెరంబూర్(చెన్నై): తనను రూ.11 కోట్ల మేరకు మోసగించారంటూ ఓ మహిళా పారిశ్రామికవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర మాజీ మంత్రి విజయ్భాస్కర్ను కేరళలోని (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఈడీ అధికారులు విచారించారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ విచారణలో పలు విషయాలను విజయభాస్కర్ వెల్లడించినట్టు సమాచారం. తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లో పలు రకాల వ్యాపారం చేస్తున్న అళప్పుళకు చెందిన షర్మిళ అనే మహిళా పారిశ్రామికవేత్త ఇటీవల తిరునల్వేలి పోలీసు కమిషనర్ వద్ద విజయభాస్కర్పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనకు విజయభాస్కర్ వ్యాపార భాగస్వామి అని, అయితే తన వద్ద తీసుకున్న రూ.14 కోట్లలో కేవలం రూ.3 కోట్లు మాత్రం చెల్లించారని, దాని గురించి అడిగితే బెదిరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కోట్లాది రూపాయల వ్యవహారం కావడంతో కేరళలోని ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారానికి సంబంధించి విచారణకు రావాలంటూ విజయభాస్కర్కు సమన్లు పంపించారు. ఆ మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు కొచ్చిన్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లిన విజయభాస్కర్ను సుమారు రెండు గంటల పాటు అధికారులు విచారించారు.