Philippines: భారీ భూకంపం...సునామీ ముప్పు లేదు
ABN , First Publish Date - 2021-07-24T13:27:38+05:30 IST
ఫిలిప్పీన్స్ దేశంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది....

మనీలా (ఫిలిప్పీన్స్): ఫిలిప్పీన్స్ దేశంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. లూజాన్ ప్రధాన దీవిలో శనివారం తెల్లవారుజామున 4.48 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. 112 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. కొన్ని నిమిషాల తర్వాత మరోసారి వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. మనీలా నగరానికి దక్షిణాన బటాంగాస్ ప్రావిన్సులోని కాలాటాగన్ మున్సిపాలిటీలో సంభవించిన భూకంపం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారని పోలీసు మేజర్ రోని చెప్పారు.
భూకంపానికి తోడు వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ ప్రమాదం లేదని ఫిలిప్పీన్స్ సీస్మోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం లేదని పోలీసు కార్పోరల్ బెర్నీ ఫాడెరోగావ్ చెప్పారు. ఫిలిప్పీన్స్ ద్వీపాలు రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉండటంతో తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి. భూకంపం వల్ల తలుపులు కదలడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.