Bangladesh: పథకం ప్రకారమే దుర్గా మంటపాలపై దాడులు
ABN , First Publish Date - 2021-10-18T18:39:53+05:30 IST
బంగ్లాదేశ్ లో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే దుర్గా పూజ మండపాలపై ప్లాన్ చేసి దాడులు చేశారని ఆ దేశ హోంశాఖ మంత్రి అసదుజ్జామాన్ ఖాన్...

ఢాకా (బంగ్లాదేశ్): బంగ్లాదేశ్ లో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే దుర్గా పూజ మండపాలపై ప్లాన్ చేసి దాడులు చేశారని ఆ దేశ హోంశాఖ మంత్రి అసదుజ్జామాన్ ఖాన్ ఆరోపించారు. గత వారం దుర్గా పూజ ఉత్సవాల సందర్భంగా ఒక పండల్ వద్ద ఖురాన్ ను అపవిత్రం చేశారనే ఆరోపణలతో హింసాకాండ చెలరేగింది. ఖురాన్ అపవిత్రం జరిగిందనే వార్త వ్యాప్తి చెందడంతో పలు దుర్గా పూజ మండపాలు, దేవాలయాలపై దాడి చేశారు. విధ్వంసకారులు హిందువుల దుకాణాలు, ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. హింసాకాండ, కాల్పుల ఘటనలపై 4వేలకు పైగా కేసులను బంగ్లాదేశ్ పోలీసులు నమోదు చేశారు.
దేశంలో హింసాకాండను ప్రేరేపించడం వల్లనే గాజీపూర్, బందర్బన్, చాపైనావాబ్గంజ్, చంద్పూర్, చిట్టగాంగ్, మౌల్విబజార్లలో ఘటనలు చెలరేగాయని మంత్రి చెప్పారు.హింసాకాండ కేసుల్లో తాము అన్ని ఆధారాలను సేకరించిన తర్వాత మరిన్ని వివరాలను బహిరంగపరుస్తామని మంత్రి పేర్కొన్నారు. బాధ్యులైన వారికి కఠినమైన శిక్ష విధిస్తామని మంత్రి ఖాన్ హామీ ఇచ్చారు. హింసాకాండ తరువాత దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్లో దుర్గా పూజ పండళ్లు, హిందువులపై దాడులకు వ్యతిరేకంగా చిట్టగాంగ్లో భారీ నిరసన ప్రదర్శన జరిగింది.