చెల్లెమ్మలను చంపేస్తుంటే జగనన్న పట్టించుకోరా?
ABN , First Publish Date - 2021-08-21T09:29:29+05:30 IST
‘చెల్లెమ్మలకు నేనున్నాను... అన్నగా అన్నీ చూసుకుంటాను’ అంటూ
![చెల్లెమ్మలను చంపేస్తుంటే జగనన్న పట్టించుకోరా?](https://media.andhrajyothy.com/appimg/galleries/1921082103291661/08212021035922n42.jpg)
- ఈ వారంలోనే ముగ్గురు మహిళల దారుణ హత్య
- యాప్లు, దిశ చట్టం ఏం చేస్తున్నట్టు?: రఘురామ
న్యూఢిల్లీ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ‘చెల్లెమ్మలకు నేనున్నాను... అన్నగా అన్నీ చూసుకుంటాను’ అంటూ పదేపదే మహిళలకు భరోసా ఇస్తున్న సీఎం జగనన్న, రాష్ట్రంలో చెల్లెమ్మలు వరుసగా అత్యాచారాలు, హత్యలకు గురవుతుంటే ఏం చేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. జగనన్న భరోసా మాటలు వారికి అండగా నిలవలేకపోతున్నాయని విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
‘‘ఈ వారంలోనే ముగ్గురు మహిళలు కిరాతకంగా హత్యకు గురయ్యారు. చెల్లెమ్మల రక్షణ కోసం ఏర్పాటు చేశామని చెబుతున్న యాప్లు, దిశ చట్టం ఏమైనట్టు? సీఎం జగనన్న ఎక్కడున్నారు? మనం మహిళలకు ఇచ్చిన గౌరవం ఇదేనా?’’ అని ఆయన నిలదీశారు. చెల్లెమ్మలను అత్యంత దుర్మార్గంగా చంపేస్తుంటే, జగనన్న కనీసం స్పందించకపోవడమేంటని మండిపడ్డారు. మహిళల రక్షణ కోసం సీఎం చెబుతున్న కట్టుదిట్టమైన చర్యలను కార్యరూపంలో పెట్టాలని, దోషులను త్వరితగతిన శిక్షించాలని డిమాడ్ చేశారు.