కనిమొళిపై దాఖలైన కేసుల వాయిదా
ABN , First Publish Date - 2021-02-26T15:33:59+05:30 IST
డీఎంకే ఎంపి కనిమొళికి వ్యతిరేకంగా దాఖలైన కేసులను మద్రాసు హైకోర్టు మూడు వారాలకు వాయిదావేసింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో తూత్తుకుడి నియోజకవర్గంలో...

చెన్నై/ప్యారీస్ (ఆంధ్రజ్యోతి): డీఎంకే ఎంపి కనిమొళికి వ్యతిరేకంగా దాఖలైన కేసులను మద్రాసు హైకోర్టు మూడు వారాలకు వాయిదావేసింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో తూత్తుకుడి నియోజకవర్గంలో డీఎంకే తరఫున పోటీచేసిన కనిమొళి విజయం సాధించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, ఈ గెలుపు చెల్లదని ప్రకటించాలని కోరుతూ బీజేపీ తరఫున పోటీచేసిన తమిళిసై సౌందర్రాజన్, ఆ నియోజకవర్గ ఓటరు శాంతకుమార్ మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమిళిసై సౌందర్రాజన్ ప్రస్తుతం తెలంగాణా గవర్నర్గా వ్యవహరిస్తున్నందు వల్ల ఆమెకు బదులుగా శ్రీ వైకుంఠంకు చెందిన బీజేపీ ప్రముఖుడు ముత్తురా మలింగం పిటిషన్ దాఖలు చేసేందుకు హైకోర్టు అనుమతించింది. శాంతకుమార్ దాఖలు చేసిన కేసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో, మిగతా రెండు పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎం సుబ్రమణ్యం గురువారం విచారించారు. సుప్రీంకోర్టు స్టే విధించినందువల్ల కనిమొళికి వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసు విచారణ పెండింగ్లో వుందని కారణం చూపి, ఈ కేసు విచారణ మూడు వారాలకు న్యాయమూర్తి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.